విద్యానగర్, జనవరి 2 : జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ద్వారా పేదలు, ఒంటరి మహిళలు, నిరక్షరాస్యులు, ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉచిత న్యాయ సేవలు అందజేయనున్నట్లు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తెలిపారు. ప్రతి ఒక్కరికీ న్యాయం పొందే హక్కును రాజ్యాంగం కల్పించిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లా కేంద్రాల్లోని కోర్టు ప్రాంగణాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా న్యాయ సేవాధికారి సంస్థలను ఆయన వర్చువల్ విధానం ద్వారా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం అందే విధంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థల ద్వారా ఉచిత న్యాయ సేవలు, సహాయం అందిస్తామని పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ద్వారా పేదలకు ఉచిత న్యాయ సలహా దొరుకుతుందన్నారు. ఉచితంగా సేవలు అందుతాయనే విషయాన్ని అందరికీ తెలియజేయాలని సూచించారు. దేశంలోని ప్రతి మహిళ, ఎస్సీ, ఎస్టీలు, కార్మికులు, దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగం ప్రకారం న్యాయం పొందే హక్కును కల్పించినట్లు తెలిపారు. 1995లో న్యాయ సేవాధికార సంస్థను ఏర్పాటు చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి 10 జిల్లాల్లో జిల్లా స్థాయి న్యాయ సేవాధికార సంస్థలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో సైతం జిల్లా స్థాయి న్యాయాధికార సేవా సంస్థలను ఏర్పాటు చేయడంలో సంపూర్ణ సహకారం అందించిన రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు.
న్యాయసేవా సంస్థ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా జడ్జి శ్రీదేవి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి మాట్లాడుతూ.. కక్షిదారులు న్యాయ సేవాధికార సంస్థ ను సంప్రదించి తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. సంస్థ సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎస్పీ శ్రీనివాస్రెడ్డి, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రసాద్, న్యాయమూర్తులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.