బీర్కూర్, మార్చి 11: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సమాఖ్యల ద్వారా రైతులకు అద్దెకు డ్రోన్ స్ప్రేయర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. కూలీల కొరత తగ్గించడం, సమయం ఆదా చేయడం, శ్రమను తగ్గించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు డ్రోన్ స్ప్రేయర్లను అద్దెకు ఇవ్వనున్నది. మహిళా సమాఖ్య భవనాల్లో వీటిని అందుబాటులో ఉంచిది. కామారెడ్డి జిల్లాలో మొదటి విడుతగా ఎనిమిది డ్రోన్ స్ప్రేయర్లను మంజూరు చేయగా మొదటి విడుతగా బీర్కూర్, బిచ్కుంద, మద్నూర్, రాజంపేట్, లింగంపేట్, బీబీపేట్, రామారెడ్డి, సదాశివనగర్లోని సంబంధిత కార్యాలయాలకు ఈ డ్రోన్ స్ప్రేయర్లను ప్రభుత్వం సరఫరా చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్ స్ప్రేయర్ల మొత్తం విలువ రూ.5.88 లక్షలు ఉండగా 75 శాతం మహిళా సమాఖ్య సొంత నిధులు లేకపోతే బ్యాంకుల ద్వారా రుణం, మిగిలిన 25 శాతం జాతీయ గ్రామీణ జీవనోపాధుల ప్రాజెక్టు రాయితీ కల్పిస్తున్నది. ప్రభుత్వం టెండర్ పిలువగా బ్లూ బోట్ రోబోటిక్స్ కంపెనీ రాష్ట్రంలో ఈ స్ప్రేయర్లను సరఫరా చేయడానికి టెండర్ను దక్కించుకున్నది. ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చిన అనంతరం డ్రోన్ ఆపరేటర్లను సిద్ధం చేసింది.
అన్నిరకాల పంటలకు ఎకరాకు 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో పిచికారీ చేయవచ్చు. గంటకు 5 ఎకరాలు, రోజుకు 20 ఎకరాలు పిచికారి చేయవచ్చు. రైతులు పొలాల్లో దిగాల్సిన పనిలేదు. బరువైన చేతిపంపలు మోయాల్సిన అవసరం ఉండదు. పిచికారీకి 90 శాతం నీరు ఆదా అయ్యి ఖర్చు కూడా తగ్గుతుంది. సరైన సమయంలో పిచికారీ చేయడంతో చీడపీడల నుంచి పంటలను కాపాడుకుని అధిక దిగుబడులు సాధించవచ్చు. డ్రోన్ స్ప్రేయర్లు కావాల్సిన రైతులు మండల కేంద్రాల్లోని మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో నేరుగా సంప్రదించాలి. లేదా గ్రామాల్లో ఐకేపీ, వీఏవోలు, గ్రామసంఘాల అధ్యక్షులను సంప్రదించి పేర్లను నమోదు చేసుకోవాలి.
నాకు ఉన్న ఐదు ఎకరాల పొలంలో గంటలోపు పురుగుమందు పిచికారీ చేయడంతో సమయం, డబ్బు రెండు ఆదా అయ్యాయి. చిన్నప్పటి నుంచి ఇలాంటి మందులను పిచికారీ చేసే యంత్రాన్ని చూడలేదు. 50 సంవత్సరాల నుం చి వ్యవసాయం చేస్తున్నా. కూలీలను పెట్టుకొని రెండు రోజుల్లో అయ్యే పని ఈ యంత్రంతో కేవలం గంటలోపే అయిపోవడం ఆనందంగా ఉంది.
మెగావత్ దశరథ్, రైతు, బీర్కూర్ తండామహిళా సమాఖ్య
డ్రోన్ స్ప్రేయర్ కావాల్సిన వారు మహిళా సమాఖ్య కార్యాలయంలో సంప్రదించాలి. గతంలో పురుగుమందులు పంట పొలాల్లో పిచికారీ చేస్తూ అస్వస్థతకు గురై దవాఖానల పాలయ్యారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం కొత్త టెక్నాలజీతో చేతికి మట్టి అంటకుండా డ్రోన్ స్ప్రేయర్లను అద్దెకు ఇవ్వనుంది. మొదటి విడుతలో బీర్కూర్ మండలానికి యంత్రం అందజేయడం సంతోషంగా ఉంది.
-డి. గంగాధర్, ఏపీఎం