చందూర్, ఏప్రిల్ 19 : దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థంకాని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. చందూర్ మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపీపీ లావణా రాంరెడ్డితోపాటు పలు గ్రామాలకు చెందిన దాదాపు వంద మందికి పైగా కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్లో చేరారు. వారికి భాస్కర్రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ మాట్లాడుతూ.. 19 రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న బీజేపీ.. అక్కడి ప్రజలకు తెలంగాణలో అమలు చేస్తున్న ఒక్క సంక్షేమ పథకం కూడా అందజేయడంలేదని అన్నారు. చిన్నారులు మొదలుకొని మహిళలు, రైతులు, వృద్ధుల దాకా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ చొరవతో పల్లెలు, పట్టణాలు, రాష్ట్రం అభివృద్ధిబాట పట్టిందని అన్నా రు. దేశంలోనే ఏ రాష్ర్టానికి రానన్ని అవార్డులు తెలంగాణకు దక్కుతున్నాయని గుర్తుచేశారు. దేశంలోని ప్రభుత్వ రంగసంస్థలను కార్పొరేట్ శక్తులకు అమ్ముతున్న మోదీని ప్రజలు ఎలా నమ్ముతారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఎలా ఉండేదని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ప్రస్తుతం ఎంతగా మారిందో ప్రజలకు అర్థమవుతుందని అన్నారు. ప్రజల కోసం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి 74 ఏండ్ల వయస్సులోనూ యువకుడిలా పనిచేస్తున్నారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందజేయడంలో బాన్సువాడ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారని తెలిపారు. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి చేరికలు ప్రారంభమయ్యాయని, రాబోయే ఎన్నికల్లో ఇక చూసుకుందామని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. సభాపతిపై విమర్శలు, తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు. ప్రజలే రోడ్లపై బట్టలిప్పి కొట్టే రోజులు ముందున్నాయని హెచ్చరించారు. అంతకుముందు పార్టీలో చేరిన ఎంపీపీ లావణ్యా రాంరెడ్డి మాట్లాడుతూ.. తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు కాంగ్రెస్లో పార్టీలో ఉంటూ మూడేండ్లలో ఏమీ చేయలేకపోయానని అన్నా రు. చివరి ఘట్టంలోనైనా అభివృద్ధి ఫలాలు అందజేసి ప్రజల రుణం తీర్చుకునేందుకే బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ కవితా అంబర్సింగ్, ఎంపీటీసీ శ్యాంరావు, సర్పంచులు బొడ్డోల్ల సత్యనారాయణ, సాయారెడ్డి, దాసరి గంగారాం, దేవీసింగ్, లాకావత్ రవి, విమలా లింగయ్య, సొసైటీ చైర్మన్ ప్యారం అశోక్, మాజీ చైర్మన్ మాధవరెడ్డి, గోపాల్, మేక వీర్రాజు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.