ధర్పల్లి, డిసెంబర్ 12 : మండలంలోని దమ్మన్నపేట్ గ్రామస్తులు సర్కారు బడికోసం రెండెకరాల స్థలాన్ని విరాళమిచ్చారు. వీడీసీ, సర్పంచ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో స్థలానికి సంబంధించిన పత్రాలను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో సోమవారం పాఠశాలకు అందజేశారు. గ్రా మంలో ప్రస్తుతం ఉన్న జడ్పీహెచ్ఎస్ను కొత్త స్థలంలోకి మార్చాలని విన్నవించగా ఈ విషయాన్ని సంబంధిత అధికారులతో చర్చిస్తామంటూ సానుకూలంగా స్పందించారు.
పాఠశాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. స్థలం అందజేసిన గ్రామస్తులను బాజిరెడ్డితోపాటు జడ్పీటీసీ జగన్, ఎంఈవో శ్రీనివాస్రెడ్డి అభినందించారు. అనంతరం ఆర్టీసీ చైర్మన్, జడ్పీటీసీని గ్రామస్తులు సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, గ్రామపెద్దలు పాల్గొన్నారు.