ఇందల్వాయి/ ఖలీల్వాడీ(మోపాల్), జూలై 1: దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న గిరిజనుల కల ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో నెరవేరిందని, పోడు రైతులు నేడు పట్టాదారులు అవుతున్నారని ఆర్టీసీ చైర్మన్, రూర ల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పాలనలో గిరిజన ఆదివాసీలకు చేస్తున్న మేలు.. చరిత్రలో నిలిచిపోయే అద్భుతమైన ఘట్టమని అన్నారు. ఇందల్వాయి మండలంలోని అన్సాన్పల్లి చౌరస్తా వద్ద పెద్దమ్మ గుడి ఆలయ ఫంక్షన్హాల్, మోపాల్ మండలాల్లో శనివారం నిర్వహించిన పోడు పట్టాల పంపిణీ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్తో కలిసి బాజిరెడ్డి హాజరయ్యారు. పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేసిన అనంతరం బాజిరెడ్డి మాట్లాడారు.
సీఎం కేసీఆర్ చొరవతోనే గిరిజనులకు మేలు జరిగిందని, వారం తా పట్టాదారులవుతున్నారని చెప్పా రు. రూరల్ నియోజకవర్గంలో 1,623 మంది గిరిజనులకు 3 వేల ఎకరాల పోడుభూమి పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఇందులో భాగంగానే ఇందల్వాయి మండలంలో 330 మందికి 500 ఎకరాలు, మోపాల్ మండలంలో 171 మంది లబ్ధిదారులకు 277.12 ఎకరాల భూములకు సంబంధించిన పట్టా పాస్ పుస్తకాలు అందించినట్లు వెల్లడించారు. గిరిజన బంజారా సోదరులకు వ్యతిరేకంగా బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు బంజారుల హక్కులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన సంగతిని ఆయన గుర్తు చేశారు. కొంతమంది బంజారా యువకులు బీజేపీకి భజన చేస్తున్నారని, దీని వల్ల గిరిజనులకు నష్టమే తప్ప లాభం లేదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు ఉండవని, ఇకనైనా ప్రతి ఒక్కరూ మేల్కొని బీఆర్ఎస్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలన్నారు.
తండాల్లోని నూతన గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలకు రూ.10 లక్షలు, రూరల్ పరిధిలోని కమ్యూనిటీ హాళ్ల కోసం రూ.60 కోట్లు మంజూరు చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోడు పట్టాలను పంపిణీ చేసి ఉంటే ఒక్కో ఎకరానికి రూ.25వేల చొప్పున వసూలు చేసి ఉండేవారని, వారిదంతా కమీషన్ దందా అని విమర్శించారు. ఎంపీ అర్వింద్, అతని తండ్రి డీఎస్ ఇద్దరూ కమీషన్ దొంగలేనని వారికి వచ్చిన ఎంపీ ల్యాండ్ నిధులు రూ.45కోట్లను కమీషన్లకు అమ్ముకున్నారని, ప్రజలకు ఉపయోగపడేలా ఒక్క గ్రామానికీ నిధులు కేటాయించలేదని బాజిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో డీఎస్ రౌడీలు, గుండాలు ఊళ్లకు ఊళ్లు పంచుకొని ప్రజలను కమీషన్ల పేరుతో దోచుకునేవారని, గుండాగిరి చేస్తూ బతికేవారని విమర్శించారు. గ్రామాల్లోకి బీజేపీ, కాంగ్రెస్ నాయకులు వస్తే 10 శాతం గిరిజనుల రిజర్వేషన్ ఏమైందని ప్రశ్నించాలని సూచించారు.
సీఎం కేసీఆర్ చేసిన మేలుకు గిరిపుత్రులు ఎప్పటికీ రుణపడి ఉండాలని మాజీ ఎమ్మెల్సీ వీ.గంగాధర్గౌడ్ అన్నారు. సమైక్య పాలనలో విద్యుత్, తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేదని గిరిజనులను ఓటు బ్యాంకు గా వాడుకున్నారే తప్ప వారి సంక్షేమానికి కృషి చేయలేదని గుర్తు చేశారు. అంతకు ముందు సీఎం కేసీఆర్ చిత్రపటానికి బాజిరెడ్డి, వీజీగౌడ్ పాలాభిషేకం చేశారు.
మోపాల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 26 మంది లబ్ధిదారులకు రూ.14.54లక్షల విలువజేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పంపిణీ చేశారు. జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్ పాల్గొన్నారు.