Gandhari | గాంధారి, సెప్టెంబర్ 18 : పత్తి పంటలో అంతర పంటగా గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్న గంజాయి పంటను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గాంధారి మండల పరిధిలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. గాంధారి శివారు ప్రాంతంలో పత్తి పంట మధ్యలో గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్లు సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు వ్యవసాయ క్షేత్రంలో తనిఖీలు నిర్వహించగా పత్తి మొక్కల మధ్యలో గంజాయి మొక్కలు కనిపించాయి. దీంతో సుమారు 400 గంజాయి మొక్కలను పోలీసులు గుర్తించి పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు.
గాంధారి మండలం నేరెళ్లతండాకు చెందిన పలువురు వ్యక్తులు కలిసి గంజాయి సాగుకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. గంజాయి సాగుకు ఉపయోగిస్తున్న వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన పోలీసులు సంబంధిత వ్యక్తులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ గంజాయి వంటి మత్తు పదార్థాల సాగు, విక్రయం, రవాణాకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా అరికట్టేందుకు అక్రమ గంజాయి కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. గంజాయి సాగు లేదా అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు. గంజాయి సాగుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించడంతో పత్తి పంటలో అంతర పంటగా సాగు చేస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.