బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నేడు కామారెడ్డికి రానున్నారు. మధ్యాహ్నం నిర్వహించే పార్టీ సమావేశంలో ముఖ్య కార్యకర్తల దిశానిర్దేశం చేస్తారు. కాగా మంగళవారం వేల్పూర్కు వెళ్తుండగా మార్గమధ్యంలో సిరికొండ మండలం చీమన్పల్లిలో యువజన విభాగం నాయకులతో కాసేపు మాట్లాడారు.
నిజామాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) కామారెడ్డి నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తుండడంతో అంతటా ఒకటే చర్చ జరుగుతున్నది. ఈ ప్రాంతం నుంచి గులాబీ అధినేత నామినేషన్ దాఖలు చేస్తుండగా, ప్రజల్లో ఉత్సాహం కనిపిస్తున్నది. రెట్టించిన ఆనందంతో సీఎం కేసీఆర్ను గెలిపించుకోవాలనే బలమైన ఆకాంక్షను నియోజకవర్గ ప్రజలు కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారీ మెజార్టీయే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతున్నది.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను తుత్తునియలు చేసేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నది. తెలంగాణ తెచ్చిన పార్టీగా, ఉద్యమ నాయకుడిగా కేసీఆరే స్వయంగా కామారెడ్డికి వస్తుండడంతో భవిష్యత్తులో ఈ ప్రాంతానికి చేకూరే మేలును బీఆర్ఎస్ నేతలంతా వివరిస్తున్నారు. మరోవైపు గులాబీ దళపతి రాకతో కామారెడ్డి నియోజకవర్గం మోడల్గా నిలుస్తుందని ప్రజలు ఆనంద పడుతున్నారు. ఇందుకు అనుగుణంగానే అధికార పార్టీ కార్యాచరణ ను సిద్ధం చేసింది. ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సారథ్యంలో పక్కాగా ప్రణాళికలు రూపొందుతున్నాయి. ఎన్నికల క్యాంపెయిన్ ఇన్చార్జీగా కేటీఆర్ సైతం రంగంలోకి దిగుతున్నారు. వీరికి తోడుగా ఎమ్మెల్సీ శేరి సు భాష్ రెడ్డి సైతం దీనిని విజయవంతం చేసే పనిలో నిమగ్నం అయ్యారు.
సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న నియోజకవర్గం కావడంతో రాష్ట్రంలో కామారెడ్డికి ప్రాధాన్యత ఏర్పడింది. కేసీఆర్ బరిలో నిలుస్తుండడంతో అందరి దృష్టి ఇటువైపే కేంద్రీకృతమైంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకున్నది. అక్టోబర్ 7న కామారెడ్డి పర్యటనకు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ప్రాం త నాయకులకు దిశా నిర్దేశనం చేశారు. దాదాపు గంటకుపైగా కేటీఆర్ నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో భారీ మెజారిటీయే లక్ష్యంగా గులాబీ సైన్యం పని చేయాలని సూచించారు. కేసీఆర్ రాకతో కామారెడ్డిలో గెలుపు ఖాయమైన నేపథ్యంలో మెజారిటీపైనే ఫోకస్ చేయాలని చెప్పారు.
సరిగ్గా పది రోజుల్లోనే మరోమారు కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులతో నేడు (బుధవారం) సమీక్ష నిర్వహించనుండగా, ప్రాధాన్యతను సంతరించుకున్నది. కేటీఆర్ మార్గదర్శకాల మేరకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సారథ్యంలో నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ సైతం గంప గోవర్ధన్తో కలిసి ప్రతిపక్షాల అవకాశాలను కొల్లగొడుతున్నా రు. నియోజకవర్గంలో అన్ని సామాజికవర్గాల వారితో నిరంతరం సమావేశాలు నిర్వహించడంతోపాటు సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధిపొందిన వారి ఇంటింటికీ వెళ్లి కలిసే ప్రయ త్నం చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో సాధించిన ప్రగతిని వివరించేలా గులాబీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు.
కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్ వచ్చే నెల 9న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే కేసీఆర్కు సంబంధించిన బీ-ఫామ్ను ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అందుకున్నారు. కేసీఆర్ ఆదేశాలతో ఒక సెట్ నామినేషన్ను ముందస్తుగానే సమర్పించే అవకాశాలు ఉన్నాయి. అనంతరం సీఎం కేసీఆర్ స్వయంగా తన నామినేషన్ను నవంబర్ 9న మరోసారి రిటర్నింగ్ అధికారికి సమర్పించనున్నారు. కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీకి సై అన్న తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. కామారెడ్డి పట్టణంలో కేసీఆర్ సభ, ప్రచార కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు నాయకులు సిద్ధమవుతున్నారు.
నవంబర్ 9న గజ్వేల్లో నామినేషన్ సమర్పించిన అనంతరం కేసీఆర్ నేరుగా కామారెడ్డికి వస్తారు. ఇక్కడ నామినేషన్ సమర్పించి సభలో ప్రసంగిస్తారు. కామారెడ్డి నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్ ప్రసంగం ఉండబోతున్నది. పదేండ్ల కేసీఆర్ పాలనతో కామారెడ్డి పట్టణలో రెట్టింపు అభివృద్ధి జరిగింది. సీఎం కేసీఆర్ రాకతో ఊహించని అభివృద్ధి జరగడం ఖాయంగా కనిపిస్తోంది. బుధవారం కేటీఆర్ కరీంనగర్లో పలు కార్యక్రమాలను ముగించుకొని మధ్యాహ్నం ఒంటి గంటకు కామారెడ్డికి హెలికాప్టర్లో చేరుకుంటారు. అనంతరం కార్యకర్తలతో మండలాల వారీగా భేటీ అవుతారు. సాయంత్రం 5గంటలకు హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు కేటీఆర్ టూర్ ఉండనున్నది.