భీమ్గల్/కమ్మర్పల్లి, అక్టోబర్ 29: కాంగ్రెస్ పార్టీ రైతువ్యతిరేక, ప్రజా వ్యతిరేక పార్టీ అని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం భీమ్గల్, కమ్మర్పల్లి మండలాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతుకు మేలు చేసే పథకాలపై కాంగ్రెస్ పార్టీ విషం చిమ్ముతున్నదని విమర్శించారు. ఒకడేమో రైతుబంధు దుబారా అని మాట్లాడితే, మరొకడు వ్యవసాయానికి 3 గంటల ఉచిత కరెంటు చాలని మాట్లాతాడని, మధ్యలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వచ్చి వాళ్ల రాష్ట్రంలో 5 గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నామని ఒప్పుకున్నాడని గుర్తుచేశారు. డీకే శివకుమార్ మాట్లాడిన మాటలను కార్యకర్తలకు వినిపించారు. రైతులపై వాళ్లకు ఉన్న అక్కసు బయటపడిందని, కాంగ్రెస్తో రైతులకు కరెంటు ఇబ్బందులే వస్తాయని అన్నారు. రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్న కేసీఆర్ కావాల్నా.. 2,3,5 గంటల కరెంటు ఇస్తామంటున్న కాంగ్రెస్ పార్టీ కావాలా ఆలోచన చేయాలని కోరారు.
కాంగ్రెస్, బీజేపీని నమ్మితే అరిగోస తప్పదన్నారు. కాంగ్రెస్ నేతలవి బక్వాస్, బేకార్ మాటలని మండిపడ్డారు. ఫాల్తూ కాంగ్రెస్ పార్టీ, ఫాల్తూ గ్యారెంటీలు ప్రకటిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నదని ధ్వజమెత్తారు. బీజేపీని ప్రజలెవరూ నమ్మరని అన్నారు. కొడుకు లాంటి వ్యక్తి పై ఎమ్మెల్యే పదవి కోసం అన్నపూర్ణమ్మ అసత్య ఆరోపణలు చేయడం తగునా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పదవి కోసం అన్నపూర్ణమ్మ దిగజారి మాట్లాడుతున్నారన్నారు. బీఆర్ఎస్ సైనికులు గడపగడపకూ వెళ్లి ఓటు అడగాలని, లబ్ధిదారులు వేసే ఓట్లతోనే ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రావని, ఆ స్థాయిలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మీరిచ్చే ధైర్యంతో గెలుపు పక్కా.. కేసీఆర్ గారిని మెప్పించే మెజారిటీ కోసం కృషి చేయాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించాలని సూచించారు. రూ.400కే గ్యాస్ సిలిండర్, మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా రూ.3వేలు, రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ, రైతుబంధు పెంపు, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.15లక్షలకు పెంపు, ఆసరా పింఛన్ల పెంపు విషయాలను తెలపాలన్నారు.
ఉద్యమ కాలం నుంచి భీమ్గల్ గడ్డ..బీఆర్ఎస్ అడ్డా అని మంత్రి వేముల అన్నారు. వెనుకబడిన భీమ్గల్ను వందల కోట్లతో మనసుపెట్టి అభివృద్ధి చేశానన్నారు. వేముగంటి ప్రాజెక్టు క్లియరెన్స్ తెచ్చి సాగునీటి గోస తీర్చామన్నారు. పల్లికొండ చెరువు నుంచి మిగతా చెరువులు నింపడానికి చైన్లైన్గ్యాంక్ పనులు కూడా పూర్తయ్యాయని తెలిపారు. కప్పలవాగు మీద చెక్డ్యాంలు నిర్మించి, ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని భీమ్గల్,సికింద్రాపూర్,బడా భీమ్గల్,గోన్గోప్పుల, ముచ్కూర్,బాబాపూర్,బెజ్జోర,మెండోరా,చేంగల్ ఇలా మండలంలోని సుమారు 20 గ్రామాలకు సాగునీరు అందించే ఏర్పాట్లు చేశామన్నారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత సహకారంతో భీమ్గల్ పట్టణ ముఖచిత్రమే మారిందన్నారు. వంద పడకల దవాఖాన, బస్ డిపో, వందల కోట్లతో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీలు, ఓపెన్ జిమ్, సెంట్రల్ లైటింగ్, రాథం చెరువు సుందరీకరణ ఇలా అనేక విధాలుగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. భీమ్గల్ ప్రాంత ప్రజల ప్రేమ వెలకట్టలేనిదని, అభివృద్ధి పనుల పరంపరను ఎవ్వరూ ఆపలేనన్నారు. భీమ్గల్ మండలంలో 13,574 మందికి పింఛన్లు, 15,106 మందికి రైతుబంధు, 246 మందికి రైతుబీమా, 1765 మందికి సీఎంఆర్ఎఫ్, 1430 మంది గృహలక్ష్మి, 2669 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్, 256 కులసంఘాలకు రూ.11.23కోట్ల నిధులు, 13 ఆలయాలు, 27 మసీదులు, 18 చర్చిలకు రూ.6కోట్ల నిధులను ఇచ్చినట్లు గుర్తు చేశారు.
సీఎం కేసీఆర్ సహకారంతో కమ్మర్పల్లి మండలాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేశానని మంత్రి వేముల అన్నారు. హన్మంత్ రెడ్డి ఎత్తిపోతల పథకాన్ని బాగుచేయించి ఎండాకాలంలోనూ చెరువులను నిండుకుండల్లా ఉంచామన్నారు. పునరుజ్జీవ పథకంతో వరద కాలువను కాళేశ్వరం ప్రాజెక్టు జలాలతో ఏడాదంతా నిండుగా ఉంచుతూ రెండు పంటలు పండించుకునేలా చేశామన్నారు. మండలంలో 8464 మందికి ఆసరా పింఛన్లు, 8971 మందికి రైతుబంధు, 117 మందికి రైతుబీమా, 1407 మందికి సీఎంఆర్ఎఫ్, 757 మందికి గృహలక్ష్మి, 1314 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్, 205 కుల సంఘాలకు భవనాలు మంజూరు చేయించినట్లు గుర్తుచేశారు.కార్యక్రమంలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్రెడ్డి, బీఆర్ఎస్ నేత రాజారాం యాదవ్, రైతు నాయకుడు కోటపాటి నర్సింహనాయుడు తదితరులు పాల్గొన్నారు.