నిజామాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ; రానున్న లోక్సభ ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నది. పార్టీ గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలకు పదును పెడుతున్నది. ఈ మేరకు లోక్సభ నియోజకవర్గాల వారీగా ఆ పార్టీ నాయకత్వం సమీక్షలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పలు నియోజకవర్గాల సమీక్షలు పూర్తయ్యాయి. నేడు (ఆదివారం) జహీరాబాద్, రేపు నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్లకు సంబంధించిన నాయకులతో రివ్యూ నిర్వహించనున్నది. రెండు నియోజకవర్గాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్య నాయకులతో చర్చించనున్నది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, వచ్చే లోక్సభ ఎన్నికలపై పార్టీ నాయకుల అభిప్రాయాలు సేకరించనున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో ఉన్న నిజామాబాద్, జహీరాబాద్ పార్లమెంట్ సమీక్షలు నేడు, రేపు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరుగనున్నాయి. వాస్తవానికి తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆదివారం నిజామాబాద్, సోమవారం జహీరాబాద్ సెగ్మెంట్కు సంబంధించిన రివ్యూ ఉంది. కానీ అనుకోని కారణాలతో నిజామాబాద్ సమీక్ష సమావేశం ఒకరోజు (సోమవారానికి) వెనక్కి వెళ్లింది. ఆదివారం జహీరాబాద్ సమావేశం జరుగనున్నది. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షించనున్నారు. అలాగే, పార్టీ నేతల అభిప్రాయాల సేకరణతో పాటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేయనున్నారు.
వ్యూహాలకు పదును..
కీలకమైన నిజామాబాద్ లోక్సభ స్థానం ఎంతో విభిన్నమైనది. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ జయకేతనం ఎగుర వేసింది. స్వరాష్ర్టాన్ని సాధించిన బీఆర్ఎస్కే ప్రజలంతా పట్టం కట్టారు. ఎంపీగా కల్వకుంట్ల కవిత విజయం సాధించి తెలంగాణ నుంచి తొలి మహిళా ఎంపీగా పార్లమెంట్లో అడుగు పెట్టారు. వాస్తవానికి నిజామాబాద్ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ (ఆర్మూర్, బోధన్, బాల్కొండ, నిజామాబాద్ అర్బన్, రూరల్, కోరుట్ల, జగిత్యాల) సెగ్మెంట్లలో బీఆర్ఎస్కు గట్టి పట్టు ఉన్నది. గత శాసనసభ ఎన్నికల్లో అన్నిచోట్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే గెలుపొందారు. అయితే, తెలంగాణ రాష్ట్రం నుంచి తొలి మహిళా ఎంపీగా ఎన్నికై చరిత్ర సృష్టించిన కవితను ఎలాగైనా ఓడించాలని గత లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీ చేతులు కలిపాయి. కనీసం పోటీ ఇవ్వకుండా చేతులెత్తేసిన కాంగ్రెస్.. బీజేపీకి నేరుగా మద్దతు పలికి బీఆర్ఎస్ను దెబ్బతీసింది. ఈ రెండు జాతీయ పార్టీలు వైరం ఉన్నట్లుగా బయటకు నటిస్తున్నప్పటికీ, గత ఎన్నికల్లో ఇక్కడ మాత్రం దోస్త్ మేరా దోస్త్ అన్నట్లుగా చేయి కలపడం చర్చనీయాంశంగా మారింది. ఈ అనైతిక పొత్తును స్థానిక ప్రజానీకమంతా గమనించడంతో పాటుగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన అనుభవాల నేపథ్యంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపేందుకు సిద్ధం అవుతున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు గెలుపు అవకాశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకుండా రానున్న కొద్ది రోజుల్లోనే క్షేత్ర స్థాయిలో ప్రజల మద్దతును కూడగట్టేందుకు బీఆర్ఎస్ కార్యాచరణను సిద్ధం చేస్తున్నది.
ఉత్సాహం నింపేలా..
జహీరాబాద్, నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్లలో బీఆర్ఎస్కు తొలి నుంచి మంచి పట్టు ఉన్నది. ఏ పార్టీకి లేనంత బలమైన కేడర్ కూడా గులాబీ పార్టీకి ఉంది. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో కొన్ని చోట్ల ఊహించని విధంగా ప్రతికూల ఫలితాలు వచ్చాయి. శాసనసభ ఎన్నికల తర్వాత కొంత నైరాశ్యంలో ఉన్న పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా బీఆర్ఎస్ చర్యలు చేపట్టింది. రెండు లోక్సభ స్థానాల్లో విజయమే ధ్యేయంగా వ్యూహ రచన చేయనున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో వెలువడిన అనూహ్య ఫలితాల నేపథ్యంలో ఈ సమీక్ష సమావేశాలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్తేజాన్ని ఇవ్వబోతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగట్టడంతో పాటుగా సామాన్య ప్రజలకు అండగా నిలవాల్సిన అంశాలపై సమీక్షలో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీల ద్వంద వైఖరిని ప్రజలకు వివరించేలా బీఆర్ఎస్ కార్యాచరణ చేపట్టనున్నది. ఒక్కో రోజు ఒక్కో లోక్సభ నియోజకవర్గంపై పూర్తి స్థాయి సమీక్ష ఉంటుండడంతో పార్లమెంట్ స్థానంలో పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీలు, ముఖ్య నాయకులతో కేటీఆర్ నేరుగా సమావేశమవుతున్నారు.
జహీరాబాద్లో హ్యాట్రిక్ కొట్టేలా..
జహీరాబాద్ లోక్సభ స్థానంలో హ్యాట్రిక్ విజయం సాధించడంపై బీఆర్ఎస్ గురి పెట్టింది. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ గులాబీ పార్టీ అభ్యర్థి బీబీపాటిల్ వరుసగా గెలుపొందారు. కేసీఆర్ ఆశీస్సులతో రాజకీయ అరంగేట్రం చేసిన ఆయనను ఈ ప్రాంత ప్రజలు రెండుసార్లు గెలిపించారు. ఇదే క్రమంలో మూడోసారి విజయం సాధించడంపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ కేంద్రం భౌగోళికంగా సంగారెడ్డి జిల్లాలో ఉన్నప్పటికీ, దీని పరిధిలోని నాలుగు అసెంబ్లీ (కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్) నియోజకవర్గాలు మాత్రం కామారెడ్డి జిల్లాలోనే కొనసాగుతున్నాయి. జహీరాబాద్ లోక్సభ పరిధిలో బీఆర్ఎస్కు ఆది నుంచి పట్టుం ది. ఎంపీ ఎన్నికల్లో ఈసారి కూడా విజ యం సాధించడం ద్వారా హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలన్న ఆలోచనతో పార్టీ వ్యూహాలు రచిస్తున్నది. నేడు జరుగనున్న సమావేశానికి మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలను పిలిచారు. అలాగే, జిల్లాకు చెందిన ముఖ్య నాయకత్వమంతా పాల్గొనబోతోంది. లోటుపాట్లపై లోతుగా విశ్లేషించి భారీ మె జార్టీ కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది.