బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు పండుగ వాతావరణంలో కొనసాగుతున్నాయి. నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నాయి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో సిరికొండలో, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో బాన్సువాడలో సోమవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలు ప్రేమ, ఆప్యాయతలకు వేదికలుగా మారాయి. బాన్సువాడ సభలో 500 మందికి పైగా బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమం ముగింపు సమయంలో స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హాజరై కార్యకర్తలను ఉత్సాహపరిచారు.
– బాన్సువాడ/సిరికొండ, మార్చి27
సిరికొండ,మార్చి 27: భారత రాష్ట్ర సమితి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సిరికొండ మండలంలోని కేజీదాస్ ఫంక్షన్ హాల్లో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ మాట్లాడుతూ…దేశానికే తెలంగాణ రోల్ మోడల్ అని, రాష్ట్రంలో ఉన్న పథకాలు దేశంలో ఎక్కడాలేవని అన్నారు. రాష్ట్ర పథకాలను బీజేపీ కాపీ కొడుతున్నదని అన్నారు. క్యాడర్ లేని పార్టీ బీజేపీ అని ఆరోపించారు. రానున్న ఎన్నికలకు సమాయత్తం కావాలని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఎం కేసీఆర్ సూచించారని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గ్రామాల్లో వివరించాలని అన్నారు. అభివృద్ధిని చూపిస్తూ ఎన్నికలకు వెళ్లాలని అన్నారు. బీఆర్ఎస్ పార్టీని చూసి బీజేపీకి భయం మొదలయ్యిందని,అందుకే మంత్రులు, ఎంపీలపై ఈడీ,సీబీఐ దాడులు చేయిస్తున్నారని అన్నారు.
ఉద్యమంలో భయపడని సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఢిల్లీ పాలకులకు భయపడతారా? అని స్పష్టంచేశారు. ఢిల్లీలో బీజేపీ మెడలు వంచుదామని అన్నారు. ఆంధ్రా పాలకులను తరిమికొట్టిన తమకు ఓట్ల కోసం పిచ్చి కూతలు కూస్తున్న ప్రతిపక్ష నాయకులను ఎదుర్కోవడం లేక్కేకాదన్నారు. రాష్ట్రంలో ఊరూరా అభివృద్ధి, గడప గడపకూ ప్రజా సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో చెప్పుకునే పథకాలేవీ లేవన్నారు. మోదీని నిలువరించే నాయకుడు.. దేశాన్ని రక్షించగల నేత కేసీఆర్ అని అన్నారు.
ఎంపీ అర్వింద్, రాజ్యసభ మాజీ సభ్యుడు డి.శ్రీనివాస్కు అభివృద్ధి నిధులు రూ.45కోట్లు మంజూరైతే.. రూరల్ అభివృద్ధి కోసం ఎక్కడా ఖర్చు చేయలేదని వెల్లడించారు. రూరల్ లో రూ.41కోట్లతో అభివృద్ధి చేసి చూపిస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఆ క్రమశిక్షణను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలన్నారు. ప్రజల కోసం ఎన్నో పనులు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకే ఓట్లు అడిగే హక్కు ఉందని, కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే తప్పకుండా మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తనూ కంటికిరెప్పలా కాపాడుకుంటానని అన్నారు.
కార్యక్రమంలో ధర్పల్లి జడ్పీటీసీ, జిల్లా ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు బాజిరెడ్డి జగన్, ఎంపీపీ సంగీతారాజేందర్, జడ్పీటీసీ మలావత్ మాన్సింగ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నారవోయిన శ్రీనివాస్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు ఆకుల తిరుమల్, జాగృతి రూరల్ కన్వీనర్ సాయిచరణ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రమేశ్, సొసైటీ చైర్మన్లు గంగారెడ్డి, రాములు, వైస్ చైర్మన్ ఫిలిప్, వైస్ ఎంపీపీ తోట రాజన్న, మైనార్టీ సెల్ అధ్యక్షుడు గౌస్, సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు, బీఆర్ఎస్ అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.