నిజామాబాద్, మే 5, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు (సోమవారం)ఇందూరుకు రానున్నారు. కేసీఆర్ బస్సు యాత్ర నేడు జిల్లాకు చేరుకోనున్నది. గులాబీ దళపతి కోసం ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ శ్రీకారం చుట్టిన బస్సు యాత్ర పెను సంచలనం సృష్టిస్తోంది. తండోపతండాలుగా తరలివస్తున్న జనంతో బస్సు యాత్ర, రోడ్షో దద్దరిల్లుతోంది. జనాల రాకతో రోడ్లన్నీ జనమయం కావడంతోపాటు కేసీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా వినేందుకు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత తొలిసారి లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వస్తున్న గులాబీ బాస్కు నిజామాబాద్ ప్రజలంతా ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. నిజామాబాద్ లోక్సభ పరిధిలో కేసీఆర్ టూర్ రెండు రోజుల పాటు కొనసాగుతుండగా .. తొలిరోజు కార్యక్రమం జగిత్యాలలో ఆదివారం దిగ్విజయంగా పూర్తయ్యింది. నేడు జిల్లా కేంద్రంలోని నిర్వహించే రోడ్ షో సైతం అంతకు మించిన జనంతో మారుమోగనున్నదని బీఆర్ఎస్ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. బీఆర్ఎస్నుంచి నిజామాబాద్ లోక్సభకు పోటీ చేస్తున్న బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు కోసం కేసీఆర్ ప్రచారానికి వస్తుండడంతో కాంగ్రెస్, బీజేపీలో వణుకు మొదలైంది.
జగిత్యాల నుంచి కేసీఆర్ సోమవారం సాయంత్రం నిజామాబాద్కు పయనం అవుతారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 9.30గంటల వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు,. రోడ్షో, బస్సు యాత్రలో భాగంగా నెహ్రూ చౌక్ వద్ద కేసీఆర్ కీలక ఉపన్యాసం చేయనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ తరపున అక్కడే ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 5.35 గంటలకు ఎన్టీఆర్ చౌరస్తా, పాత కలెక్టరేట్ నుంచి బస్సు యాత్రగా కేసీఆర్ ముందుకు కదులుతూ వెళ్తారు. పాత కలెక్టరేట్, తిలక్ గార్డెన్, ఖలీల్వాడి, ప్రభుత్వ జనరల్ దవాఖాన, బాపూజీ వచనాలయం మీదుగా గాంధీ చౌక్ నుంచి నెహ్రూ చౌక్ వరకు బస్సు యాత్ర కొనసాగుతుంది. జిల్లా కేంద్రంలో కేసీఆర్ బస్సు యాత్ర కోసం ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కారుపై కేసీఆర్ సంధిస్తోన్న వ్యాఖ్యలు, కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు పడుతున్న గోస, మోసపోయిన ప్రజల బాధలను కేసీఆర్ ఉటంకిస్తుండడంతోపాటు భరోసాను కల్పిస్తున్న తీరును స్వయంగా వినేందుకు జనాలంతా తరలిరానున్నారు. పదేండ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సకల జనులకు అండగా నిలిచిన కేసీఆర్ ఇప్పుడు కూడా అదే స్థాయిలో అండగా ఉంటూ కాంగ్రెస్ మెడలు వంచి ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రయత్నించనున్నారు. ఇందుకోసం కేసీఆర్కు మద్దతు తెలియజేసేందుకు ఇందూరువాసులు కేసీఆర్కు జై కొట్టేందుకు సిద్ధం అవుతున్నారు.
పర్యటనలో భాగంగా సాయంత్రం నిజామాబాద్కు కేసీఆర్ రావడంతోనే బస్సు యాత్ర ద్వారా ప్రజలను కలుస్తారు. దారిపొడవునా జనాలకు అభివాదం చేస్తూ ముందుకు కదులుతారు. తదనంతరం ఎన్నికల నియమావళి ప్రకారం రాత్రి 10గంటల్లోపే ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని రాత్రికి నిజామాబాద్లోనే కేసీఆర్ బస చేస్తారు. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా నివాసంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. మరుసటి రోజు మంగళవారం నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నాయకులతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. గులాబీ శ్రేణులు, నాయకత్వంతో సమీక్షలు నిర్వహిస్తారు. లోక్సభ పోరులో బీఆర్ఎస్ విజయమే లక్ష్యంగా శ్రేణులకు గులాబీ బాస్ దిశా నిర్దేశనం చేయనున్నారు. మంగళవారం సాయంత్రం కామారెడ్డిలో నిర్వహించే బస్సు యాత్రలో పాల్గొనేందుకు కేసీఆర్ బయల్దేరుతారు. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే కామారెడ్డి ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించి రాత్రికి మెదక్ జిల్లాకు కేసీఆర్ చేరుకుంటారు.