సారంగాపూర్, ఏప్రిల్ 17: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు ఓట్ల ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు. నిజామాబాద్లోని తన నివాస ప్రాంగణంలో బుధవారం నిజామాబాద్ అర్బన్లోని ఆలిండియా జై హింద్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఆల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్సింహాచారి ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి షేక్ షాబాద్,
కోశాధికారి షేక్ ఖాసీంతోపాటు 39, 38, 13, 30, 15 డివిజన్లకు చెందిన 30 మంది బీఆర్ఎస్లో చేరారు. వీరికి బాజిరెడ్డి గోవర్ధన్ గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. రాష్ట్ర, దేశ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిన బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో మట్టి కరిపించాలని సూచించారు. ఝూఠా పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయమాటలు నమ్మొద్దని, ఈ రెండు ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా రైతు వ్యతిరేక విధానాలపై ప్రజలకు వివరించి చైతన్యపర్చాలన్నారు.