ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్కు ఆదినుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పట్టం కడుతూ వస్తున్నది. పార్టీ పురుడు పోసుకున్న నాటి నుంచి కంచుకోటగా నిలుస్తున్నది. తెలంగాణ ఏర్పాటు అనంతరం రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులపై ఇతర పార్టీల నేతలు భారీగా గులాబీ పార్టీలోకి వలస వస్తున్నారు. టీఆర్ఎస్.. జాతీయ పార్టీగా రూపాంతరం చెందడంతో మరింత జోష్ పెరిగింది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ అత్యధిక సభ్యత్వాలు కలిగి ఉన్నది. రోజురోజుకూ చేరికల జోరు పెరగుతుండడంతో పార్టీ మరింత బలోపేతం అవుతున్నది. ముఖ్యంగా బీజేపీ నుంచి చాలా మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతోపాటు సామాన్య కార్యకర్తలు సైతం గులాబీ గూటికి చేరుకుంటున్నారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా సారథ్యంలో భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లోనూ ఇదే తీరు కనిపిస్తున్నది. బీజేపీకి ఏండ్లుగా సేవలందించిన నాయకులు ఎంపీ అర్వింద్ తీరుతో విసిగిపోయారు. సీఎం కేసీఆర్ విజన్ను చూసి నందిపేట, ఆర్మూర్, మాక్లూర్ మండలాలకు చెందిన బీజేపీ స్థానిక ప్రజాప్రతినిధులు, నిజామాబాద్ అర్బన్లో11 మంది కార్పొరేటర్లు గులాబీ కండువా కప్పుకున్నారు. నిత్యం ఎక్కడో ఓ చోట చేరికలు కొనసాగుతుండడమే బీఆర్ఎస్ పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణకు నిదర్శనం.
నిజామాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆది నుంచి గులాబీ పార్టీకి కంచుకోటగా నిలుస్తున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం అవుతున్నది. జాతీయ పార్టీలకు అందనంతగా దూసుకుపోతున్నది. టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా రూపాంతరం చెందడంతో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ పాత్రను ఆహ్వానిస్తూ ప్రజలంతా స్వచ్ఛందంగా గులాబీ కండువాను కప్పుకుంటున్నారు. అంతేకాకుండా కేసీఆర్కు జై కొడుతూ బీజేపీ అవలంబిస్తున్న తెలంగాణపై వివక్షను అడుగడుగునా ఎండగడుతున్నారు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ కన్నా అత్యధిక సభ్యత్వాలతో గులాబీ పార్టీ పటిష్టమైన పునాదులను కలిగి ఉంది. తాజాగా పెరుగుతున్న చేరికలతో మరింతగా బలోపేతం అవుతున్నది. ముఖ్యంగా బీజేపీ నుంచి చాలా మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో పాటు సామాన్య కార్యకర్తలు కారెక్కుతున్నారు. నగరం, పట్టణం, గ్రామాలు ఇలా తేడా లేకుండా చేరికల జోరు అంతటా కనిపిస్తున్నది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి సొంత నియోజకవర్గం ఆర్మూర్తో పాటు మంత్రి నియోజకవర్గం బాల్కొండ, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా సారథ్యంలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లోనూ ఇదే తీరు కనిపిస్తున్నది.
కాంగ్రెస్, బీజేపీ కన్నా మిన్నగా బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకూ మరింత బలాన్ని పుంజుకుంటున్నది. 2001లో పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు గులాబీ పార్టీకి ఉద్యమ కాలం నుంచి అనేక ఎన్నికల్లో ఈ ప్రాంత బిడ్డలంతా ఏకపక్షంగా విజయాన్ని పట్టం కట్టినవారే. అదే అభిమానాన్ని నేటికీ గులాబీ పార్టీ పట్ల ప్రజలంతా చూపిస్తుండడంతో జాతీయ పార్టీల కన్నా అనేక రెట్లు ఎక్కువగా బీఆర్ఎస్ బలం పెంచుకున్నది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో గులాబీ పార్టీ ఊహించిన దాని కన్నా ఎక్కువగానే కార్యకర్తల బలాన్ని సొంతం చేసుకున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో జరిగిన సభ్యత్వ నమోదులో నియోజకవర్గానికి 50వేల మెంబర్షిప్ చొప్పున ఉభయ జిల్లాల్లో దాదాపు 5లక్షల మందికి పార్టీ బలగం చేరింది. కాంగ్రెస్, బీజేపీలకు మండల స్థాయిలో బలం అంతగా లేదు. కాషాయ జెండా పట్టుకున్న వారంతా గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో వారి సిద్ధాంతాలకు జై కొట్టేందుకు కూడా జనం దొరకని దుస్థితి వారికి ఏర్పడింది. వరుస ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం మూలంగా కాంగ్రెస్, బీజేపీల బలం సన్నగిల్లింది. తద్వారా గులాబీ పార్టీకి ప్రజల్లో ప్రాధాన్యత పెరుగుతున్నది.
వరుసగా కాషాయ పార్టీ నుంచి గులాబీ పార్టీకి భారీగా చేరికల పర్వం నడుస్తున్నది. బీజేపీలో ఎంపీలుగా ఉన్న బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ తీరుకు నిరసనగా బీజేపీని వీడుతున్నారు. గడిచిన కొద్ది రోజులుగా వరుస పెట్టి చాలామంది గులాబీ కండువా కప్పుకున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో నందిపేట, ఆర్మూర్, మాక్లూర్ మండలాలకు చెందిన బీజేపీ స్థానిక ప్రజా ప్రతినిధులు కారెక్కారు. నిజామాబాద్ అర్బన్లోనైతే 11 మంది కార్పొరేటర్లు బీజేపీ ఎంపీ తీరును నిరసిస్తూ కాషాయ పార్టీని వదిలేశారు. పసుపు బోర్డు అంశాన్ని ప్రశ్నించినందుకు రైతులపై దాడి చేసిన కారణంగా నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తీరును నిరసిస్తూ నందిపేట ఎంపీటీసీ గతంలోనే కారెక్కారు. ఆర్మూర్ మండలం చేపూర్ ఎంపీటీసీ, బోధన్ నియోజకవర్గంలోని రెంజల్ మండలం నీలా ఎంపీటీసీ సైతం బీజేపీని వీడారు. బీజేపీలో దశాబ్దాలుగా సేవలందించిన నేతలు సైతం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి గులాబీ కండువా కప్పుకుంటున్నారు. ఇందులో నిజామాబాద్ నగరపాలక సంస్థలో బీజేపీ నుంచి కార్పొరేటర్లుగా గెలిచిన చాలా మంది ఇప్పటికే పార్టీ మారారు. పెరుగుతున్న వలసలతో కాషాయ పార్టీ విలవిల్లాడుతున్నది. ఉన్న వారిని కాపాడుకోలేక సతమతమవుతోంది. బాల్కొండలోనూ చేరికల జోరు అప్రతిహతంగా సాగుతున్నది. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సారథ్యంలో బీఆర్ఎస్కు జై కొడుతూ వందలాది మంది యువత కారెక్కేందుకు తరలి వస్తుండడం విశేషం.
నిజామాబాద్ లోక్సభ సభ్యుడు ధర్మపురి అర్వింద్ సొంత పార్టీలో పాత, కొత్త నాయకులంతా జై కొట్టేందుకు వెనుకడుగు వేస్తున్నారు. అర్వింద్ నాయకత్వంలో పని చేయలేక బీజేపీకి స్వచ్ఛందంగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి ప్రదాత కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీకి జై కొడుతూ కారెక్కుతున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చలేక చతికిల పడిన ఎంపీపై ఇంటా బయట వ్యతిరేకత పెరుగుతున్నది. పసుపు బోర్డు అంశంపై రైతన్నలంతా ఎంపీని వెంటాడుతున్నారు. ఈ దశలోనే నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో బీజేపీ పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన కార్పొరేటర్లు అర్వింద్ తీరును ఆది నుంచి తప్పు పడుతున్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన తాము జనాలకు మేలు చేయాలంటే బీఆర్ఎస్ పార్టీయే చక్కని వేదిక అని ఎలుగెత్తి చాటుతున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి ఉన్నప్పటికీ నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి ఎంపీగా ధర్మపురి అర్వింద్ తీసుకుంటున్న చొరవ శూన్యమంటూ విమర్శిస్తున్నారు. నిత్యం నోటి మాటలే తప్ప అభివృద్ధిలో పోటీ పడకలేక పిచ్చి ప్రేలాపనలు చేస్తూ రెచ్చగొట్టడం సరికాదంటూ సొంత పార్టీ నేతలే గుస్సా అవుతున్నారు. ఎంపీ అర్వింద్కు గతంలోనే కార్పొరేటర్లంతా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తీరు మార్చుకోకపోతే బీజేపీని వదులుతామని తేల్చి చెప్పినట్లే కాషాయ పార్టీకి దండం పెట్టి గులాబీ జెండాను ఎత్తుకుంటున్నారు.