బాన్సువాడ/ బీర్కూర్ 27: తెలంగాణ తిరుమల దేవస్థానంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని పచ్చటి తోరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం ఉదయం వేంకటేశ్వరస్వామి, లక్ష్మీ, గోదాదేవి అమ్మవార్లను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం శాస్ర్తోక్తంగా రుత్వికులు ధ్వజారోహణం నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభం మీదకు గరుడ పతాకం ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. యజ్ఞశాలలో నిర్వహించిన యజ్ఞంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు, ఆయన సోదరుడు పరిగె శంభురెడ్డి దంపతులు పాల్గొన్నారు. అర్చకుడు దేవనాథ రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో తీర్థగోష్ఠి, విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, యాగశాల ప్రవేశం, అగ్నిప్రతిష్ట, చతుస్థానార్చనం, ధ్వజారోహణం, బలిహరణం, పూర్ణాహుతి, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.
పెద్దశేష వాహనంపై స్వామివారి ఊరేగింపు..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం పెద్దశేష వాహనంపై మాఢవీధుల్లో స్వామివారిని ఊరేగించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి స్వయంగా ట్రాక్టర్ నడిపారు. సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం, దేవతాహ్వానం, చతుస్థానార్చనం, పూర్ణాహుతి, బలిహరణం, తీర్థప్రసాద వితరణ నిర్వహించారు. అనంతరం స్వామివారిని సింహ వాహనంపై ఊరేగించారు. పూజా కార్యక్రమాల్లో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి, దొడ్ల వెంకట్రామ్ రెడ్డి, గురు వినయ్కుమార్, ఆలయ కమిటీ సభ్యులు మద్దినేని నాగేశ్వర్ రావు, ద్రోణవల్లి అశోక్, సతీశ్, నర్సరాజు, రాంబాబు, బోగవల్లి అప్పారావు, కిరణ్, ఆలయ మేనేజర్ విఠల్ తదితరులు పాల్గొన్నారు.
భక్తులతో కిటకిటలాడిన ఆలయం..
బ్రహోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం నుంచే ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. బాన్సువాడ ఆర్డీవో రాజాగౌడ్ దంపతులు, మిషన్ భగీరథ ఎస్ఈ రాజేంద్రకుమార్, ఈఈ లక్ష్మీనారాయణ, డీఈ శ్రీకాంత్, బీర్కూర్ తహసీల్దార్ రాజు, ఎంపీడీవో భానుప్రకాష్తోపాటు ఇతరత్రా సిబ్బంది , భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.
ఉచిత బస్సు సౌకర్యం..
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం తిమ్మాపూర్ కమాన్ నుంచి ఆలయం వరకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు తిమ్మాపూర్ నుంచి వెంకన్నకొండ వరకు ఉచితంగా బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.