గాంధారి, జూన్ 11: మూడేండ్ల బాలుడిపై కుక్కలు దాడిచేయడంతో తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని ముదెల్లి గ్రామంలో చోటుచేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బల్గూరి స్రవంతి – ప్రవీణ్ దంపతుల చిన్న కుమారుడు లక్ష్మణ్ ఆదివారం ఇంటి ముందర ఆడుకుంటున్నాడు. వీధి కుక్కలు బాలుడిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. గమనించిన స్థానికులు కుక్కలను తరిమివేశారు. కుక్కలు బాలుడిని పొట్ట భాగంలో కరవడంతో పేగులు బయటికి వచ్చాయి. వెంటనే అతడిని బాన్సువాడ ఏరియా దవాఖానకు తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్కు తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు.