లింగంపేట/రామారెడ్డి, మార్చి 13: తల్లి మందలించిందని వేర్వేరు ప్రదేశాల్లో ఇద్దరు సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. తల్లి జులాయిగా తిరుగుతున్నావని మందలించడంతో యువకుడు, ఐస్ క్రీమ్ కొనేందుకు డబ్బులు ఇవ్వలేదని బాలిక క్షణికావేశంలో ఉరేసుకొని తనువు చాలించారు. ఈ రెండు ఘటనలతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొన్నది.
పని చేయకుండా తిరుగుతున్నావని తల్లి మందలించడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకున్నది. ఎస్సై శంకర్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. లింగంపేటకు చెందిన తోడంగల రాజు(19) బైక్ మెకానిక్గా పనిచేసేవాడు. ప్రస్తుతం అతడు జులాయిగా తిరగడంతో ఏం పని చేయడం లేదని తల్లి భాగ్య మందలించింది. దీంతో అతడు క్షణికావేశంలో ఇంట్లో ఫ్యాన్కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
తల్లి ఐస్క్రీమ్ కొనుక్కునేందుకు డబ్బులు ఇవ్వలేదని ఓ బాలిక సోమవారం ఆత్మహత్య చేసుకున్నది. రామారెడ్డి ఎస్సై అనిల్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అన్నారం గ్రామానికి చెందిన పుల్లూరి వేదశ్రీ(17) ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నది. ఐస్క్రీమ్ కొనుక్కుంటానని, వంద రూపాయలు ఇవ్వాలని తల్లిదండ్రులను సోమవారం అడిగింది. దానికి తల్లి నిరాకరించడంతో ఇంట్లో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. తండ్రి వెంకటేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.