సుభాష్నగర్, జూలై 28: పులోరియా.. పులోరియా.. అంటూ భక్తుల హోరుతో ఇందూరు నగరం పునీతమైంది. పోతరాజుల చిందులు, శివసత్తుల పూనకాలు, తొట్లెల ఊరేగింపుతో సందడి నెలకొన్నది. ఆదివారం ఊరపండుగను పురస్కరించుకొని నిజామాబాద్ నగరం జనసంద్రమైంది. ఊర పండుగలో ప్రధానమైన పదార్థం సరిని నగరవాసులు తమ ఇండ్లపై, పొలాల్లో ఎంతో భక్తిప్రపత్తులతో చల్లుకున్నారు.
పిల్లాజెల్ల, పాడిపంట, గొడ్డూగోజ అంతా చల్లగా ఉండేలా చూడు తల్లీ అంటూ.. అమ్మవార్లను వేడుకున్నారు. అమ్మవారి తొట్లెలు, బండారి సమర్పణలు, గుగ్గిలం పొగలు, కల్లు సాకలు,యాటల బలులు, డప్పుల దరువులు, పోతరాజుల విన్యాసాలు, భక్తుల పూనకాలు, భవిష్యవాణి.. ఇలా జిల్లాకేంద్రంలో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించింది. ఖిల్లా రఘునాథ్ ఆలయం వద్ద ఉన్న శారదాంబ గద్దె (తేలు మైసమ్మ గద్దె) వద్ద గ్రామ దేవతలను ప్రతిష్ఠించారు. పూజారులు పసుపు, కుంకుమ, చెవిపోగులు, గాజులు, ఆభరణాలతో అలంకరించి పూజలు నిర్వహించారు.
దేవతామూర్తులను ఊరేగింపుగా గాజులపేట్ చౌరస్తా మీదుగా పెద్దబజార్ చౌరస్తా నుంచి రెండు బృందాలుగా విడిపోయి ఒక బృందం పౌడలమ్మ, నల్లపోచమ్మ, అడెల్లి పోచమ్మ, పెద్దమ్మ, పులిరాజులు, రాట్నం, తొట్లెలతో దుబ్బ వైపు ఊరేగింపుగా వెళ్లింది. రెండో బృందం సిర్నాపల్లి గడి, గోల్ హనుమాన్ చౌరస్తా మీదుగా వినాయక్నగర్లోని ఐదు చేతుల పోచమ్మ, మత్తడి పోచమ్మ, మహాలక్ష్మమ్మ ఆలయం వైపు వెళ్లింది. సరిని దక్కించుకోవడం కోసం భక్తులు పోటీపడ్డారు. పూజల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నగర మేయర్ నీతూకిరణ్, సర్వసమాజ్ అధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు