ఓ బార్ నుంచి రూ.2.30 లక్షలు వసూలు
తనిఖీల పేరుతో ప్రతిరోజూ వేధింపులు
ఆయన బారి నుంచి కాపాడాలని కలెక్టరేట్లో బాధితుడి ఫిర్యాదు
నిజామాబాద్ క్రైం, జూలై 1: బీజేపీకి చెందిన ఓ కార్పొరేటర్ భర్త తమను వేధిస్తున్నారని, ఆయన నుంచి తమను రక్షించాలని నవీన్ అనే బాధితుడు కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఫిర్యాదు చేశాడు. నవీన్ (బార్ సూపర్వైజర్) మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతంలో మున్సిపల్, ఎక్సైజ్శాఖ, ఫుడ్, కమర్షియల్ డిపార్ట్మెంట్ల నుంచి అన్ని అనుమతులు తీసుకొని తన యజమాని బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపాడు. గతంలో బిల్డింగ్ నిర్మాణ పనులు కొనసాగుతున్న సమయంలో బీజేపీ కార్పొరేటర్ భర్త పంచరెడ్డి శ్రీధర్ అనే వ్యక్తికి ఒకేసారి నగదు రూపంలో రూ. 2 లక్షలు ఇచ్చామని చెప్పాడు.
మళ్లీ ఫోన్పే ద్వారా రూ.30 వేలు ఆయనకు ఇచ్చిన్నట్లు పేర్కొన్నాడు. అయినప్పటికీ ప్రతిరోజూ బార్లోకి వచ్చి అదీ బాగోలేదు..ఇదీ బాగోలేదు.. అంటూ టార్చ ర్ పెడుతున్నాడని ఆరోపించాడు. తనకు ఆయన నుంచి విముక్తి కలిగించాలని కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. పంచరెడ్డి శ్రీధర్ లోకల్గా తిరిగే మున్సిపల్ సిబ్బందికి డబ్బులు ఇచ్చి ప్రతిరోజూ మున్సిపల్ చెకింగ్ అంటూ తమ బార్కు పంపుతున్నాడని చెప్పాడు. మున్సిపల్ అధికారులు ఈ విషయంపై దృష్టిసారించాలని కోరాడు. మున్సిపల్ కమిషనర్కు సైతం ఫిర్యాదు చేసినట్లు నవీన్ తెలిపాడు.