నిజామాబాద్, మార్చి 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి): లోక్సభ ఎన్నికల ముంగిట భారతీయ జనతా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. కమలం పార్టీలో మరోసారి లుకలుకలు బహిర్గతమయ్యాయి. నిజామాబాద్, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో ఇద్దరు సిట్టింగ్ ఎంపీలకు అభ్యర్థిత్వాల ఖరారు బీజేపీలో అగ్గి రాజేసింది. మొదట్నుంచి పార్టీలో ఉన్న వారికి స్థానం లేకపోవడం, సీనియర్ లీడర్ల విన్నపాలను పట్టించుకోకపోవడం వంటి కారణాలపై కుమిలి పోతున్నారు. జెండాలు మోసిన వారిని వదిలేసి అధికారం చూసి పార్టీలోకి వచ్చిన వారికి పెద్దపీట వేస్తుండడంపై మండిపడుతున్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో వరుసగా రాజకీయ సమీకరణాలను పరిశీలించుకుంటూ తమకు పార్టీలో విలువే లేదన్నట్లుగా బాధ పడుతున్నట్లుగా తెలుస్తున్నది. ఆశావహుల విన్నపాలను పరిశీలన చేయకుండానే ఇతర పార్టీల నుంచి వచ్చిన సిట్టింగ్లకు గంటల వ్యవధిలోనే సీట్లు కేటాయించిన అధిష్టానం వైఖరిపై నొచ్చుకుంటున్నారు.
నిజామాబాద్లోనూ సిట్టింగ్ ఎంపీగా ధర్మపురి అర్వింద్ను బీజేపీ నేతలే జీర్ణించుకోవడం లేదు. బాహాటంగానే సొంత పార్టీ నేతలే ఢిల్లీ, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేసిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. అర్వింద్ వద్దే వద్దంటూ ప్లకార్డుల ప్రదర్శనలు, ధర్నాలు, రాస్తారోకో ద్వారా నిరసన తెలిపారు. అర్వింద్కు టికెట్ ఇస్తే పని చేయబోమంటూ చాలా మంది బాహాటంగానే ప్రకటించారు. ఒక నాయకుడైతే అర్వింద్కు హఠావో… బీజేపీకో బచావో అంటూ ఢిల్లీలో నిరసన తెలియజేశారు. ఈ వ్యవహారం దుమారం రేపడంతో అర్వింద్ అనుచరుడిగా గుర్తింపు పొందిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి వెంటనే రంగంలోకి దిగి ఆ నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంతో ఎంపీ అర్వింద్కు వ్యతిరేకంగా గళం విప్పితే సస్పెండ్ చేస్తామంటూ జిల్లా నేతలు తమ నిరంకుశత్వాన్ని బయట పెట్టుకున్నారని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే అర్వింద్కు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే యెండల, అల్జాపూర్ శ్రీనివాస్లు అధిష్టానానికి ఫిర్యాదులు అందించారు. అర్వింద్ వ్యవహారశైలి నచ్చని బీజేపీ శ్రేణులు చాలా మంది ఈ ఎన్నికల్లో సహాయ నిరాకరణ చేస్తామంటున్నారు. దీంతో బీజేపీ అధిష్టానానికి కార్యకర్తల బలాన్ని తెలియజేస్తామంటూ ప్రకటిస్తున్నారు.
తెలుగు భాషపై ఎలాంటి అవగాహన లేని లోక్సభ సభ్యుడు బీబీ పాటిల్ వరుసగా రెండుసార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచారు. బీఆర్ఎస్ ఊపు, కేసీఆర్ బొమ్మతో వరుస విజయాలను అందుకున్నారు. ఎంపీ పదవి పూర్తికాక ముందే బీబీ పాటిల్ తనకు రాజకీయ భవిష్యత్తను అందించిన బీఆర్ఎస్ను కాదని రాత్రికి రాత్రే బీజేపీకి మకాం మార్చేశాడు. ఢిల్లీలో కాషాయ కండువా కప్పుకొని వచ్చే ఎన్నికల్లో కమలం పార్టీ నుంచి పోటీకి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ వ్యవహారంపై బీబీ పాటిల్పై బీఆర్ఎస్ శ్రేణులంతా తీవ్రంగా మండిపడుతుండగా బీజేపీలోనూ అదే తీరు కనిపిస్తున్నది. జహీరాబాద్ స్థానం నుంచి పోటీ చేసేందుకు బీజేపీ నుంచి చాలా మంది ఆశావహులు ముందుకు వచ్చారు. పైడి ఎల్లారెడ్డి, సోమాయప్ప, మాజీ కేంద్ర మంత్రి ఆలె నరేంద్ర తనయుడు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందిన సుభాష్ రెడ్డి, బాణాల లక్ష్మారెడ్డి తదితరులు చాలా మంది అభ్యర్థిత్వం కోసం ప్రయత్నాలు చేశారు. పార్టీని నమ్ముకొని వీరంతా చాలా కాలంగా కష్టపడి పనిచేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన సుభాష్రెడ్డి ఎంపీ సీటు తథ్యమని గతంలోనే బీజేపీ పెద్దల నుంచి మాట దక్కింది. ఇప్పుడేకంగా పక్క పార్టీ నుంచి వచ్చిన సిట్టింగ్ ఎంపీకి టికెట్ కేటాయించడంతో బీజేపీలో ఇంటిపోరు తారాస్థాయికి చేరింది. బీఆర్ఎస్లో ఉన్నప్పుడే గులాబీ శ్రేణులను కనీసం పట్టించుకోలేదని ఆరోపణ బీబీ పాటిల్పై ఉన్నది. అలాంటి వ్యక్తి బీజేపీ నేతలను ఎలా కలుపుకొని పోతాడంటూ ముఖ్యనేతలను అసంతృప్త నేతలంతా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.