జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన భారత రాష్ట్ర సమితికి ‘మహా’త్తరమైన మద్దతు లభిస్తున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ విస్తరిస్తున్న తీరును యావత్జాతి ఆసక్తిగా గమనిస్తున్నది. తెలంగాణ గుమ్మం ఖమ్మంలో గులాబీ పార్టీ గత నెలలో నిర్వహించిన భారీ బహిరంగ సభ ద్వారా జాతీయ రాజకీయాలకు సరికొత్త దిశానిర్దేశం చేసింది. ఇప్పుడు అదే స్థాయిలో నాందేడ్ వేదికగా నేడు భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నది. తద్వారా మహారాష్ట్రలోనూ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నది. సీఎం కేసీఆర్ హాజరు కానున్న ఈ సభ కోసం మరాఠీలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సమర్థవంతమైన సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వం తమకూ కావాలని కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారు.
నిజామాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నాందేడ్ భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన గులాబీ పార్టీ తొలిసారి మరో రాష్ట్రంలో భారీ సభతో అరంగేట్రం చేస్తున్నది. నిజామాబాద్ జిల్లాకు సరిహద్దున ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలో సభ జరుగనున్నది. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధమైన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి సభతో చరిత్ర సృష్టించగా.. తాజాగా మహారాష్ట్రలో సభతోనూ చారిత్రక ఘట్టానికి నాంది పలుకబోతున్నారు. దశాబ్ద కాలంగా కేసీఆర్పై ఆకర్షితులైన మహారాష్ట్ర వాసులు గులాబీ కండువా కప్పుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. 2014 అనంతర కాలంలో కొత్త రాష్ట్రం తెలంగాణలో జరిగిన అభివృద్ధిని గమనిస్తున్న ప్రజలంతా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. స్వరాష్ట్రం సిద్ధించిన అనంతరం తెలంగాణ ప్రజలకు అందుతున్న సంక్షేమ పాలనను చూస్తున్న మరాఠా ప్రజలంతా తమకూ కేసీఆర్ కావాలంటూ కోరుకుంటున్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్ ఏకంగా సభను ఏర్పాటు చేసి కొండంత అండగా నిలువబోతున్నారు.
మరాఠా ప్రజలకు అండగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమవడంతో మరాఠ్వాడాలో కొంగొత్త వెలుగులు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు జై కొట్టి కేసీఆర్కు సంపూర్ణ మద్దతును తెలుపుతామని వారంతా స్థానిక ప్రజలంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా ఫిబ్రవరి 5న తలపెట్టిన బహిరంగ సభతో నాందేడ్ గులాబీమయమైంది. సభకు సరిహద్దు ప్రాంత తెలంగాణ ఎమ్మెల్యేలు, గులాబీ నేతలు సభ సక్సెస్ కోసం అహర్నిషలు కష్టపడుతున్నారు. అధినేత ఆదేశాలతో మహారాష్ట్రలో జరుగుతున్న తొలి బీఆర్ఎస్ సభను దిగ్విజయం చేసేందుకు కంకణం కట్టుకొని పని చేస్తున్నారు. ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జీవన్ రెడ్డి, షకీల్ అహ్మద్తో పాటు ఇతర నాయకత్వం కొంత కాలంగా ఇక్కడే మకాం వేసి తమ పరిచయాలతో మరాఠా ప్రజలను ఉత్తేజపరుస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఆనుకొని ఉన్న మహారాష్ట్ర ప్రాంతమంతా నాందేడ్ జిల్లా పరిధిలోనికే వస్తుంది. మహారాష్ట్రలో అతిపెద్ద జిల్లాల్లో నాందేడ్ ఒకటి. రాజధాని ముంబయికి తూర్పు దిశలో ఉన్న ఈ ప్రాంతంపై ఆది నుంచీ చిన్నచూపే. పాలనలో ఎక్కడా ఈ ప్రాంత ప్రజలకు అందిన సహకారం ఏమీ లేదు. సాగు, తాగు నీటికి నిత్యం కటకట. సంక్షేమం అన్నది మచ్చుకు కనిపించదు. ఇలాంటి సమయంలో ఈ ప్రాంత ప్రజలకు ఆశాదీపంగా భారత రాష్ట్ర సమితి నిలిచింది.
బీజేపీ పాలిత రాష్ట్రమైన మహారాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారం అరకొరే. కేంద్రంలో, మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ పరిపాలన సాగిస్తున్నప్పటికీ ప్రజలకు జరుగుతున్న మేలు ఇసుమంతైనా లేదు. డబుల్ ఇంజిన్ సర్కారుగా గొప్పలు చెప్పుకునే బీజేపీ ప్రగల్భాలు శూన్యమన్నది ఇక్కడి వాతావరణం స్పష్టం చేస్తున్నది. మహారాష్ట్ర సరిహద్దున ఉన్న తెలంగాణ ప్రాంతంలో మాత్రం దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పాలన సాగుతున్నది. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. 2014లో నూతన రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ ఇప్పుడేకంగా ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. కేసీఆర్ అందిస్తున్న అనేక పథకాలను మోడీ ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ర్టాలు సైతం అమలు చేస్తుండడమే ఉదాహరణ. ఇలాంటి పాలన మాకు కూడా కావాలని మరాఠాలు నాలుగైదు ఏండ్లుగా కోరుకుంటుండగా ఆ క్షణాలు ఆచరణ బాట పట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నట్లు అర్థమవుతున్నది.
మహారాష్ట్రలో దుర్భిక్షం తాండవిస్తున్నది. చెరువులు, కుంటలు, సాగు ప్రాజెక్టులు మచ్చుకు కూడా లేవు. వానకాలం మినహాయిస్తే యాసంగి పంటలు పండించడం ఇక్కడ కష్టమే. జీవనది పుట్టిన గడ్డలో ఇంతటి దయనీయమైన పరిస్థితులు మరాఠా ప్రజాప్రతినిధుల వైఫల్యానికి నిదర్శనం. చిన్న నీటి పారుదల వ్యవస్థ అంతగా లేకపోవడం మూలంగా సాగు నీళ్లు దరిచేరడం లేదు. తెలంగాణలో ఊరూరా ఉన్న చెరువులను కేసీఆర్ బాగు చేయించారు. కాలువలను పునరుద్ధరించారు. రెండు పంటలకు సరిపడా నీళ్లు అందిస్తున్నారు. ఇక మహారాష్ట్రలో జీవాలపై ఆధారపడిన వృత్తి కుటుంబాలకు ఆదరణే లేదు. తెలంగాణలో యాదవ కుటుంబాలకు ప్రభుత్వం భారీ రాయితీతో గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తున్నది. జీవాల ఆరోగ్య పరిరక్షణకు పాటుపడుతున్నది. మరాఠా ప్రాంతంలో పైసా మందం సాయం అందడం లేదు. సెలూన్ షాపులకు తెలంగాణలో ఉచితంగా కరెంట్తో ప్రయోజనం చేకూరుస్తున్నది. మహారాష్ట్రలో అలాంటి పరిస్థితి లేదు. మహారాష్ట్రలో ఉదయం 11గంటలైనా ప్రాథమిక కేంద్రాలకు సిబ్బంది రారు. దవాఖానలు దయనీయంగా ఉన్నాయి. గ్రామాల్లో అంతర్గత రోడ్లు కరువు. గ్రామ సచివాలయాలు కూలిపోయే స్థితిలో ఉన్నాయి. పాలకవర్గాలు అచేతనంగా పని చేస్తున్నాయి. తెలంగాణ పల్లెలు సర్వాంగ సుందరంగా ముస్తాబై మెరిసిపోతుంటే పూర్తి వ్యతిరేకంగా మరాఠా గ్రామాలు దర్శనం ఇస్తున్నాయి.
మరాఠా ప్రజలకు కేసీఆర్ అంటే భారీ క్రేజ్. తెలంగాణ ప్రజల్లో చిరస్థాయి గుర్తింపును సంపాదించుకున్న సీఎంకు పొరుగు రాష్ట్రంలోనూ ఇంత ప్రేమ ఉండడం అద్భుతం. తెలంగాణ పథకాలకు ఆకర్షితులైన వారంతా పెద్ద ఎత్తున గులాబీ జెండాకు జై కొడుతున్నారు. మాకు కూడా కేసీఆర్ కావాలంటూ మరాఠా ప్రజలు నినదిస్తున్నారు. నాందేడ్ సభ చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.
– హన్మంత్ షిండే, జుక్కల్ ఎమ్మెల్యే
నాందేడ్ సభ కోసం కొద్ది రోజులుగా ఇక్కడే ఉంటు న్న. ఇక్కడి ప్రజలు కేసీఆర్ను ప్రత్యక్షంగా చూసేందుకు చాలా ఆసక్తిని చూపుతుండడం గొప్ప విషయం. తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న కేసీఆర్.. మాక్కూడా కావాలంటూ వారంతా స్వచ్ఛందంగా బీఆర్ఎస్కు మద్ధతు తెలుపుతున్నా రు. కేసీఆర్కు పెరుగుతున్న ఆదరణతో బీజేపీకి ఎనలేని భయం పట్టుకున్నది.
– షకీల్ అహ్మద్, బోధన్ ఎమ్మెల్యే