ఖలీల్వాడి, జూలై 22 : భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చైర్మన్ అధ్యక్షతన శుక్రవారం జడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎజెండాలోని వివిధ అంశాలపై చర్చించగా.. ప్రధానంగా వ్యాధుల నివారణపై సభ్యులు ప్రస్తావించారు. దీనిపై చైర్మన్ విఠల్రావు స్పందిస్తూ.. రికార్డుస్థాయిలో వర్షాలతో అనేక ప్రాంతాల్లో నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందొద్దని ప్రభుత్వ యంత్రాంగం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలించారని గుర్తుచేశారు. సీజనల్ వ్యాధుల నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 183 శాతం అధిక వర్షపాతం కురిసిందని తెలిపారు. జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధుల సహకారంతో నష్టాన్ని నివారించామని తెలిపారు. పలు చోట్ల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. విద్యుత్ ప్రమాదాలపై దృష్టిసారించామని వివరించారు. పడకల్ పెద్దచెరువు మినహా గండ్లు పడకుండా అన్ని చెరువులను కాపాడుకున్నామని తెలిపారు.
జిల్లాలో రూ. 90 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, జిల్లాలో పర్యటించిన కేంద్ర బృందానికి నివేదికలను అందించామని కలెక్టర్ తెలిపారు. రోడ్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను పునరుద్ధరిస్తామన్నారు. వ్యాధులు ప్రబలకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సైతం ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ కోరారు. ప్రైవేటు దవాఖానల్లో అధిక మొత్తంలో వసూలుచేస్తున్న బిల్లులను కట్టడిచేయాలని పలువురు సభ్యులు కోరగా… ఆ దిశగా కలెక్టర్ ప్రత్యేక దృష్టిపెట్టారని ఎమ్మెల్సీ వి.గంగాధర్గౌడ్, జడ్పీ చైర్మన్ విఠల్రావు తెలిపారు. జిల్లా జనరల్ దవాఖానలో ప్రత్యేకంగా సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు స్పెషల్ ఓపీ సేవలు అందుబాటులోకి తెచ్చామని సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ తెలిపారు. సమావేశంలో జడ్పీ సీఈవో గోవింద్, వివిధ శాఖల అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.