డిచ్పల్లి, అక్టోబర్ 29: నా 45 ఏండ్ల రాజకీయ జీవితం పేదలకు అంకితం చేశానని, బలహీనులను బలవంతులను చేయడానికే తాను కృషి చేస్తానని నిజామాబాద్ రూరల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని ఎస్ఎల్జీ గార్డెన్స్లో ఆదివారం నిర్వహించిన రూరల్ నియోజకవర్గం పద్మశాలీ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీసీబంధు పథకంలో పద్మశాలీ కులాన్ని చేర్చడానికి సీఎం కేసీఆర్తో మాట్లాడతానని తెలిపారు. పద్మశాలీ సంఘాలు తనకు మద్దతు తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం సంతోషంగా ఉన్నదన్నారు. పద్మశాలీ కులస్తులు సొసైటీలు ఏర్పాటు చేసుకుంటే మంత్రి కేటీఆర్తో మాట్లాడి టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తన జీవితం తెల్లకాగితం లాంటిదన్నారు. రూరల్ నియోజకవర్గంలోని ఇప్పటివరకు 55 పద్మశాలీ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కోసం రూ.2.50 కోట్లు నిధులు ఇచ్చానన్నారు. మూడోసారి తనను గెలిపిస్తే పద్మశాలీలు రాజకీయంగా ఎదిగేందుకు తనవంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన డాక్టర్ భూపతిరెడ్డి ఓడిపోయిన అనంతరం ప్రజలను గాలికి వదిలేసి పోయాడని విమర్శించారు.
ఎన్నికల కోసం ఇల్లు అమ్ముకున్నాను, భూములు అమ్ముకున్నానంటూ దొంగ ఏడ్పులతో మీ ముందుకు వచ్చి మాయమాటలతో మోసం చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. రాజకీయం అంటే వ్యాపారం కాదని, ఓడినా, గెలిచినా ప్రజల మధ్యనే ఉండాలని పేర్కొన్నారు. బీజేపీ.. దేశాన్ని దోచుకునే పార్టీ అని, ఎన్నికల సమయంలో ఓట్లు అడిగేందుకు ఆ పార్టీ నాయకులు వస్తే నిలదీయాలని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కులవృత్తులకు జీవం పోసేందుకే పలు పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. రూరల్ నియోజకవర్గంలో స్థలం చూయిస్తే పద్మశాలీ సంఘం నిర్మాణం కోసం రూ.50లక్షలు మంజూరు చేయిస్తానని బాజిరెడ్డి గోవర్ధన్ హామీఇచ్చారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రూరల్ ఇన్చార్జీ, మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పే కల్లబొల్లి మాటలను నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు అండగా నిలబడి మూడోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ సంబారి మోహన్, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్రెడ్డి, జిల్లా పద్మశాలీ సంఘం కార్యదర్శి పుల్గం హన్మండ్లు, పట్టణ పద్మశాలీ సంఘం అధ్యక్షుడు గుజ్జేటి నర్సయ్య, తన్నూరి శ్రీనివాస్, చిలువేరి దాసు, శక్కరికొండ కృష్ణ, శ్రీపతి శేఖర్, రామకృష్ణ, లోలం జగదీశ్వర్, చింత మహేశ్, రేగుంట విశ్వప్రకాశ్, సామల రాజేశ్, చిలుక రాజేశ్వర్, అంకం నరహరి, భూమేశ్వర్, రాధాకిషన్, ఎస్పీ నారాయణ, తాల్ల రాజు, ఏడు మండలాల పద్మశాలీలు తదితరులు పాల్గొన్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన రూరల్ ప్రజలకు ఎంతో రుణపడి ఉంటానని, మరోసారి గెలిపిస్తే రెట్టింపు అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. డిచ్పల్లి మండలం ధర్మారం(బి) వీడీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధర్మారం(బీ) గ్రామానికి సీఎం కేసీఆర్ను తీసుకువచ్చి నిధులు మంజూరు చేయించానన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వైకుంఠధామం, హైస్కూల్కు ప్రహరీ, సెంట్రల్ లైటింగ్, డివైడర్ ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కమ్మ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కలగర శ్రీనివాస్, సర్పంచ్ పత్తి మమతాఆనంద్, వీడీసీ అధ్యక్షుడు తలారి సాయన్న, విండో చైర్మన్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.