హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ)/బాసర: రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ (బాసర ట్రిపుల్ ఐటీ)లో టీ, వీ హబ్ స్ఫూర్తిగా గ్రీన్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ తెలిపారు. కూకట్పల్లి జేఎన్టీయూలో శుక్రవారం ఎడ్యు సమ్మిట్ జరిగింది. ప్రొఫెసర్ వెంకటరమణ మాట్లాడుతూ.. బాసరలోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వేదికగా ఈ గ్రీన్ హబ్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ప్రొఫెసర్ వెంకటరమణ, సీఎంవో ఓఎస్డీ, ఫారెస్ట్ కళాశాల డీన్ ప్రియాంక వర్గీస్లు పరస్పర ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.
దీంతోపాటు గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ-హెచ్తోనూ ఒప్పందం చేసుకున్నారు. గ్రీన్ హబ్లో అటవీ ఉత్పత్తులకు బ్రాండింగ్గా, మార్కెటింగ్కు పరస్పర సహకారం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్మూర్తి, బాసర ట్రిపుల్ఐటీ డీన్లు, అసిస్టెంట్ డీన్లు చంద్రశేఖర్, దేవరాజ్, పావని, వినోద్, హరిబాబు, రాకేశ్రెడ్డి, సారిక, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.