ప్రభుత్వ దవాఖానలు కార్పొరేట్కు దీటుగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులతో అత్యాధునిక వైద్య సేవలను పేదలకు అందుబాటులోకి తెస్తున్నది. దీంతో మన దవాఖానలకు జాతీయస్థాయి అవార్డులు సొంతమవుతున్నాయి. ఇదే కోవలోకి చెందింది బాన్సువాడలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కృషితో దవాఖానలో అత్యుత్తమ సేవలు అందుతున్నాయి. దీంతో జాతీయస్థాయి అవార్డులు సైతం వరించాయి.
బాన్సువాడ, ఏప్రిల్ 13: పేద ప్రజలకు వైద్యం అందని ద్రాక్ష… పేదలకు జబ్బు చేస్తే నయం చేసుకోవడానికి ఆస్తులను అమ్ముకోవడం, అప్పుల పాలవ్వడం. రోగం కన్నా రోగ పరీక్షల ఖర్చు తడిసి మోపెడు. ఇదీ.. తెలంగాణ రాక మునుపు రాష్ట్రంలోని వైద్య రంగం పరిస్థితి. ఆనాడు సర్కారు దవాఖానల వైపు కన్నెత్తి చూడని జనం.. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ వైద్యరంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులతో సర్కారు దవాఖానలు కార్పొరేట్ హాస్పిటళ్లను తలపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దవాఖానలకు దండిగా నిధులు మంజూరు చేస్తుండడంతోపాటు అన్ని సౌలత్లు కల్పించడంతో వైద్యరంగంలో తెలంగాణ దూసుకుపోతున్నది. వైద్యులందిస్తున్న సేవలతో జాతీయ స్థాయి అవార్డులను అందుకుంటున్నాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని మారుమూల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న సంకల్పంతో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వంద పడకల మాతా శిశు సంరక్షణ దవాఖానను ఏర్పాటు చేశారు.
ఈ దవాఖానకు నిత్యం వందల సంఖ్యలో ప్రసవాలు, చిన్నారుల వైద్యం కోసం బాన్సువాడ, బీర్కూర్ , నస్రుల్లాబాద్, నారాయణఖేడ్, కల్హేర్, బిచ్కుంద, నిజాంసాగర్, మద్నూర్, పిట్లం తదితర ప్రాంతాల నుంచి తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో మాతా శిశు దవాఖానను ఫ్రెండ్లీ పేషెంటింగ్ దవాఖానగా మార్చారు. తల్లీబిడ్డల సంరక్షణే ధ్యేయంగా వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలకు ఇటీవల జాతీయ స్థాయి, ప్రపంచ ఆరోగ్య సంస్థలు నిర్వహించిన సర్వేలో ముందు వరుసలో ఉన్నది. పుట్టిన బిడ్డకు 15 నిమిషాల్లోపు తల్లి ముర్రు పాలు అందించేలా వైద్య సిబ్బంది, దవాఖాన వైద్యబృందం తల్లులకు ఇచ్చిన అవగాహన కార్యక్రమాలతో దేశంలోనే మొదటి ప్రభుత్వ మాతాశిశు దవాఖానగా బాన్సువాడ ఎంసీహెచ్ నిలవడం గర్వకారణం. ఇదిలా ఉండగా పుట్టిన నవజాత శిశువు నుంచి 12 ఏండ్ల వయస్సు వరకు సమస్యలతో ఉన్న చిన్నారులకు ఆరోగ్య సేవలు అందించే కార్యక్రమం ముస్కాన్కు బాన్సువాడ ఎంసీహెచ్ పోటీ పడుతున్నది.
చిరునవ్వుతో అందించే వైద్యమే ముస్కాన్..
దవాఖానకు వచ్చే రోగులు, గర్భిణులు, చిన్నారులకు ప్రశాంతమైన వాతావరణంలో వైద్యం అందించడమే ముస్కాన్. వైద్యం అంటే భయానికి లోనుకాకుండా, వైద్యులు చిరునవ్వుతో సేవలు అందించాలని, దవాఖానకు వచ్చే చిన్నారులకు, ప్రసవాల కోసం వచ్చిన గర్భిణులకు ముందుగానే అవగాహన కల్పించడం, వారి ఆరోగ్యపరంగా అవసరమయ్యే ఆహార పోషణ తదితర అంశాలను వివరించేలా ఈ కార్యక్రమం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు, జ్వరాలు తదితర సమస్యలతో దవాఖానకి తెచ్చిన చిన్నారులకు ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉండే వాతావరణ కల్పించేలా ఆటవస్తువులతో కూడిన గదిని ఎంసీహెచ్లో ఏర్పాటు చేశారు. చిన్నారులు మంచి సౌకర్యాలు ఉన్నాయని తల్లిదండ్రులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. చిన్నారులను ఆకట్టుకునేలా దవాఖాన పరిసర ప్రాంతాలు, వైద్యుడి ఓపీ గది, దవాఖాన గోడలపై వేసిన బొమ్మలు చిన్నారులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.
లక్ష్య అవార్డు ఇలా…
ఒక గర్భిణి కాన్పుకు వచ్చిదంటే వారికి గౌరవప్రదంగా చికిత్స అందించాలి. ఏకాంతతకు ఎలాంటి భంగం వాటిళ్లకుండా ఉండేలా దవాఖానలో వైద్య సేవలు అందించాలన్నదే లక్ష్య అవార్డు లక్ష్యం. లేబర్ రూమ్ మొదలుకొని వార్డుల్లో తల్లి, బిడ్డలకు అందిస్తున్న వైద్య సేవలు, అందించిన సేవల్లో నాణ్యతా ప్రమాణాలు, సిబ్బంది పనితీరు, సిబ్బందికి నాలెడ్జ్ లెవల్ పరీక్ష తదితర అంశాలపై పూర్తిస్థాయిలో పరిశీలించిన జాతీయ వైద్య బృందం లక్ష్య అవార్డుకు ఎంసీహెచ్ను ఎంపిక చేసింది.
త్వరలోనే మరిన్ని వైద్య సేవలు
బాన్సువాడ ప్రభుత్వ మాతా శిశు దవాఖానకు త్వరలోనే మరిన్ని అధునాతన వైద్య పరికరాలతో వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు ఉన్న వైద్య పరికరాలు, వైద్య సేవలకు తోడుగా నవజాత శిశువుల కోసం 20 బెడ్లతో కూడిన ఎస్ఎన్సీయూ సెంటర్ను ప్రారంభించనున్నారు. ఇప్పటికే దవాఖానలో న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్ను ప్రారంభించారు. త్వరలోనే బాన్సువాడ దవాఖానకు డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్(డీఐసీ) రానున్నట్లు దవాఖాన వర్గాలు తెలిపాయి.
తల్లి పాల ప్రాముఖ్యత వివరణ ఇలా…
తల్లిపాలు బిడ్డకు అమృతం, బిడ్డకు ముర్రు పాలు పట్టించడంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. పుట్టిన బిడ్డకు ముర్రుపాలు పడితే బిడ్డతోపాటు తల్లీ ఆరోగ్యంగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా తల్లుల అందరికీ బ్రెస్ట్ ఫీడింగ్ మీద అవగాహన వారం అంటే ఆగస్టు 1 నుంచి 7 వరకు 120కి పైగా దేశాల్లో నిర్వహించి గర్భిణులకు, బాలింతలకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలు, మారుమూల ప్రాంతాల నుంచి దవాఖానకు పరీక్షల కోసం వచ్చిన నాటి నుంచి డెలివరీ వరకు, ఆ తర్వాత ముర్రుపాల ప్రాముఖ్యతను వైద్య సిబ్బంది , నర్సులు, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు అవగాహన కల్పిస్తున్నారు. బిడ్డ పుట్టిన 15 నిమిషాల్లో ముర్రు పాలు అందించడంతో ఎంత మేలు జరుగుతుందో వివరించడంలో బాన్సువాడ ప్రభుత్వ మాతాశిశు దవాఖానలోని వైద్య సిబ్బంది సేవలు దేశ ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ఎంసీహెచ్లో 20మంది వైద్య సిబ్బంది తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ, క్షేత్రస్థాయిలో విజయవంతమవుతుండడం విశేషం.
అవార్డుల జల్లులు..
దవాఖానలో అందించే వైద్య సేవలను వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి వైద్య బృందాలు పరిశీలించి, పలు దఫాలుగా తనిఖీలు చేపట్టి దవాఖాన స్టాండర్డును పరిశీలించి అవార్డులకు ఎంపిక చేస్తారు. అందులో బాన్సువాడ మాతా శిశు దవాఖానకు మూడు సార్లు కాయకల్ఫ అవార్డు వచ్చింది. మాతాశిశు దవాఖానతోపాటు డయాలసిస్ సెంటర్, బ్లడ్ బ్యాంక్లకు కోట్లాది రూపాయలు మంజూరు చేయించి ప్రజలకు సేవలందిస్తున్నారు. 20 పడకలతో నవజాత శిశువు కేంద్రాన్ని రూ.27లక్షలతో ఏర్పాటు చేశారు. దీంతో పుట్టిన బిడ్డకు పచ్చకామెర్లు లేదా బరువు తక్కువగా ఉంటే వార్మింగ్ మిషన్లో ఉంచి తల్లి పాలు అందిస్తూ సేవలందిస్తున్నారు. ఎన్హెచ్ఆర్సీ, ఎన్హెచ్ఎం ద్వారా 2019, 20, 21 సంవత్సరాల్లో కాయకల్ప అవార్డుకు ఎంపికయ్యింది. 2019లో నేషనల్ క్వాలిటీ ఇస్యూరెన్స్ స్టాండర్డు అవార్డు వచ్చింది. 2021- 22లో ఏకో ఫ్రెండ్లీ అవార్డు సాధించింది. 2023లో దేశ ఖ్యాతిని నిలిపేలా బ్రెస్ట్ ఫీడింగ్ దవాఖాన ఇన్షియేటివ్ను దక్కించుకోవడం విశేషం.
ఆనందంగా ఉన్నది..
బాన్సువాడ ప్రభుత్వ మాతాశిశు దవాఖానకు జాతీయ స్థాయిలో బ్రెస్ట్ ఫీడింగ్ హాస్పిటల్ ఇన్షియేటివ్గా ఖ్యాతి దక్కడం చాలా ఆనందంగా ఉన్నది. స్పీకర్ పోచారం కృషితో దవాఖానలో మౌలిక వసతులు, అధునాతన వైద్య పరికరాలను ఏర్పాటు చేయడంతో మెరుగైన సేవలు అందిస్తున్నాం. దవాఖానకు అవార్డులు రావడం వెనుక ఇక్కడ పనిచేసే అన్నివర్గాల శ్రమ ఉన్నది. నాణ్యమైన వైద్యం అందించడంలో రాజీపడే ప్రసక్తే లేదు.
– డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, దవాఖాన సూపరింటెండెంట్
తల్లీబిడ్డల సంరక్షణకు కృషి ..
బాన్సువాడ దవాఖానలో నిత్యం 400-500 వరకు గర్భిణులు, బాలింతలు పరీక్షల కోసం వస్తుం టారు. ప్రతి ఒక్కరికీ సమయం ఇచ్చి డెలివరీ సమయం, డెలివరీ అనం తరం తల్లీబిడ్డల సంరక్షణపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తాం. తల్లి పాల ప్రాముఖ్యతను వివరించ డంతోపాటు డబ్బా పాలతో కలిగే అనర్థాలను వివరిస్తాం. మేము కల్పి స్తున్న అవగాహన కార్యక్రమాలతో దవాఖానకు బ్రెస్ట్ ఫీడింగ్ హాస్పిటల్ ఇన్షియేటివ్ రావడం చాలా సంతోషంగా ఉన్నది.
– డాక్టర్ శిరీష, ఎంసీహెచ్