బాన్సువాడ టౌన్, జనవరి 10 : రాష్ట్రంలోని ప్రతి పల్లె, పట్టణాన్ని ప్రభుత్వం సుందరంగా తీర్చిదిద్దుతున్నది. ప్రజలకు ఆహ్లాదం పంచడానికి అనేక చర్యలు చేపడుతున్నది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించి పరిసరాలను సుందరీకరించి మినీ ట్యాంక్ బండ్లను ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో పలు చెరువుల వద్ద మినీ ట్యాంక్ బండ్లను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని కల్కి చెరువుతోపాటు నిజామాబాద్ నగరంలోని రఘునాథ చెరువుపై మినీ ట్యాంక్బండ్లను నిర్మించింది.
చెరువులపై అందమైన మొక్కలను నాటడంతో పరిసరాలు ఆహ్లాదకరంగా మారాయి. బోటింగ్ సదుపాయం కూడా ఉండడంతో కుటుంబ సభ్యులతో వచ్చి సేదదీరుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్, ఫేస్బుక్లో ఇటీవల పోస్టు చేశారు. దీంతో ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వ కృషిని ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు.