బాన్సువాడ.. అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ప్రగతికి చిరునామాగా నిలుస్తున్నది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో గత తొమ్మిదేండ్లలో నియోజకవర్గంలో విస్తృతంగా అభివృద్ధి జరిగింది. బాన్సువాడ హెల్త్, ఎడ్యుకేషన్ హబ్గా మారింది. డబుల్ బెడ్రూం ఇండ్లకు కేంద్రంగా నిలిచింది. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఒక్క ఈ నియోజకవర్గానికే 11 వేల ఇండ్లను మంజూరు చేయించిన ఘనత స్పీకర్కే దక్కింది. ఇప్పటికే ఏడు వేల ఇండ్లు నిర్మించి పేదలకు గూడు కల్పించారు. నియోజకవర్గంలో ప్రతి ఎకరానికీ నీరందించాలనే లక్ష్యంతో రూ.350 కోట్లతో చందూరు, జాకోరా, సిద్ధ్దాపూర్ ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టారు. కేజీ టు పీజీ వరకు అన్ని రకాల విద్యాలయాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. జిల్లా దవాఖానతో పాటు మాతాశిశు సంరక్షణ కేంద్రం, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు ద్వారా అధునాతన వైద్యాన్ని ప్రజల చెంతకు చేర్చారు. రాష్ట్రంలోనే బాన్సువాడ నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలబెట్టారు.
– బాన్సువాడ, ఏప్రిల్ 8
బాన్సువాడ, ఏప్రిల్ 8 : ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా పాలకుల పెత్తనమే ఉండేది. అప్పటి నేతలు తెలంగాణ ప్రాంతాన్ని పట్టించునేవారు కాదు. బాన్సువాడ నియోజకవర్గ పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. అభివృద్ధి కోసం ఎన్నిసార్లు అడిగినా రూపాయి విదిల్చేవారు కాదు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సుదీర్ఘంగా పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో బాన్సువాడ నియోజకవర్గం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. నిరంతరం ప్రజలకోసం తపనపడే పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఇప్పుడు అభివృద్ధి పరుగులు పెడుతున్నది. రూ.10వేల కోట్లతో నలుమూలలా ప్రగతి ఫలాలు కనిపిస్తున్నాయి. అద్దాల్లా రోడ్లు, ప్రతి గుంటకూ సాగునీరు, ఇంటింటికీ సంక్షేమ పథకాలు, భావి పౌరులకు నాణ్యమైన విద్య, పేదలకు కార్పొరేట్ వైద్యం అందుతున్నది. ప్రధానంగా గూడులేని కుటుంబాలకు రాష్ట్రంలోనే ఎక్కడా లేనన్ని ఇండ్లు కట్టించి పేదల జీవిత కలను సాకారం చేశారు. ఒకప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న బాన్సువాడ.. నేడు ప్రగతికి జాడగా మారిపోయింది.
రైతు ఖాతాల్లో రూ. 600 కోట్ల పెట్టుబడి సాయం
సాగునీటి వసతి, పంటలకు మద్దతు ధర లేక ఎంతో గోసపడ్డ రైతు.. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో వ్యవసాయాన్ని పండుగలా మార్చుకున్నాడు. పుష్కలంగా సాగునీటిని అందుబాటులోకి తేవడంతోపాటు ఉచితంగా కరెంటు, పంటకు పెట్టుబడి సాయం, మద్దతు ధర, రైతుబీమా, సకాలంలో ఎరువులు, విత్తనాలు ఇవ్వడంతో సంబురంగా సాగు చేస్తున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని అన్నదాతలకు రైతుబంధు పథకం కింద ఇప్పటివరకు రూ. 600 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. 1277 మంది రైతులు వివిధ కారణాలతో మృతిచెందగా, బాధిత కుటుంబాలకు రైతుబీమా ద్వారా రూ. 70 కోట్లు అందించి ధైర్యం నింపారు. వ్యవసాయానికి 24గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ అందజేస్తున్న కారణంగా డివిజన్ పరిధిలో కరెంటు సమస్యలు తలెత్తకుండా 225 కేవీ సబ్స్టేషన్ ఏర్పాటు చేశారు. పోచారం వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు దాదాపు రూ. 40 కోట్లతో వెయ్యి మంది రైతులకు రాయితీపై ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, యంత్ర పరికరాలను అందజేశారు.
11వేల డబుల్ బెడ్రూం ఇండ్లు..
బాన్సువాడ నియోజకవర్గంలోని పేదలకు అన్ని విధాలా అండగా నిలుస్తున్న పోచారం.. గూడు లేని కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేశారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా రికార్డు స్థాయిలో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. ఇక్కడ పేదల కోసం నిర్మించిన ఇండ్లు దేశానికే ఆదర్శంగా మారాయి. బాన్సువాడ పట్టణంతోపాటు ఆయా మండలాల్లో మొత్తం 11 వేల ఇండ్లు పేద కుటుంబాలకు మంజూరు చేశారు. బాన్సువాడలో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో నిర్మించిన ఇండ్ల సముదాయం గృహ నిర్మాణ పథకానికే ఆదర్శం.
కులవృత్తులకు చేయూత..
కులవృత్తులపై ఆధారపడ్డవారు పనిలేక ఒకప్పుడు కూలీనాలీ చేసుకొని పొట్టనింపుకునేందుకు పట్టణాలకు వలసపోయారు. స్వరాష్ట్రంలో వారి బాధలన్నీ దూరమయ్యాయి. అంతరించిపోతున్న కులవృత్తులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందించింది. గొల్ల కుర్మలకు గొర్రెల యూనిట్లు, మత్స్యకార్మికులకు ఉచితంగా చేపపిల్లలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు యంత్రాలు, ఉచిత విద్యుత్ వంటి పథకాలు అందించి నేడు సొంతూళ్లోనే గౌరవంగా బతికేలా భరోసా కల్పించింది. బాన్సువాడ నియోజకవర్గంలోని చెరువుల్లో రూ. 100 కోట్ల విలువైన చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేసింది. దాదాపు రూ. 300 కోట్లతో గొర్రెల యూనిట్లు అందజేసింది. ఇతర కులవృత్తుల వారికి పూర్తి రాయితీతో లక్ష రూపాయల వరకు రుణాలు మంజూరు చేసింది.
ఉచితంగా కార్పొరేట్ వైద్యం
ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్.. బాన్సువాడ నియోజకవర్గానికి భారీగా నిధులు కేటాయించారు. బాన్సువాడ పట్టణంలో దాదాపు రూ.100 కోట్లతో ప్రభుత్వ దవాఖానలను ఆధునీకరించి పేదలకు ఉచితంగా కార్పొరేట్ తరహా సేవలందిస్తున్నారు. ఒకప్పుడు సర్కారు దవాఖానకు వెళ్లాలంటే భయపడే జనానికి ఆధునిక పరికరాలను అందుబాటులోకి తేవడంతో ప్రభుత్వ వైద్యంపై భరోసా కలిగింది. బాన్సువాడలోని ఏరియా దవాఖానలో అందిస్తున్న సేవలకు గాను మూడుసార్లు కాయకల్ప, నేషనల్ క్వాలిటీ అస్సూరెన్స్ స్టాండర్డ్ అవార్డు దక్కింది. తల్లీబిడ్డల సంక్షేమంలో భాగంగా స్పీకర్ పోచారం ప్రత్యేక చొరవతో రూ. 20 కోట్ల నిధులతో మరో వంద పడకల మాతాశిశు దవాఖానను అందుబాటులోకి తెచ్చారు. ఈ దవాఖాన ఏడాదిన్నర కాలంలోనే బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ ఇనిషియేటివ్ అవార్డుతో గ్రేడ్-1 సాధించింది. ఇదే దవాఖానలోని మెటర్నిటీ వార్డుకు లక్ష్య వంటి జాతీయ అవార్డులు వచ్చాయి. మరోవైపు బ్లడ్బ్యాంక్, ఎన్ఐసీయూ, కిడ్నీ రోగులకు డయాలసిస్ సెంటర్ వంటి అత్యవసర వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారు. కోటగిరి మండలకేంద్రంలోని పీహెచ్సీని స్పీకర్ పోచారం.. రూ.13 కోట్లతో 50 పడకల దవాఖానగా అప్గ్రేడ్ చేయించారు. మెరుగైన సేవలందిస్తున్న పొతంగల్ పీహెచ్సీ.. కాయకల్పతోపాటు మరో జాతీయ అవార్డుకు ఎంపికైంది.
బాన్సువాడ మున్సిపాలిటీకి ఆధునిక హంగులు
మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న బాన్సువాడను ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం 2018లో మున్సిపాలిటీగా మార్చింది. రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో పట్టణానికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆధునిక హంగులు కల్పించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రూ. రెండు కోట్లతో ప్రొఫెసర్ జయశంకర్ మినీస్టేడియం నిర్మించారు. రూ. ఏడు కోట్లతో కల్కి చెరువుపై మినీ ట్యాంక్బండ్ నిర్మించి పర్యాటక కేంద్రంగా తీర్చిద్దారు. అమెరికా తరహాలో ఆధునిక సాంకేతిక పద్ధతిలో సీసీతో డబుల్ రోడ్డు నిర్మించారు. రూ. రెండు కోట్లతో నూతన మున్సిపల్ భవనం, రూ.80 లక్షలతో రెవెన్యూ కార్యాలయ సముదాయం, రూ. రెండు కోట్లతో సమీకృత మార్కెట్, మినీ ట్యాంక్బండ్ వద్ద రూ. నాలుగు కోట్లతో ఆక్సిజన్ పార్కు, చిల్డ్రన్స్ పార్కును ఏర్పాటు చేస్తున్నారు.
ఎడ్యుకేషన్ హబ్..
చదువుకునేందుకు సౌకర్యాలు లేక వెనుకబడిన బాన్సువాడ నియోజకవర్గం.. నేడు ఎడ్యుకేషన్ హబ్గా మారింది. సీఎం కేసీఆర్ సహకారంతో విద్యావ్యవస్థను మెరుగుపర్చి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించేలా అన్ని కళాశాలలను స్పీకర్ పోచారం అందుబాటులోకి తెచ్చారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లను మంజూరు చేయించారు. విద్యార్థులకు దాదాపు రూ. 100 కోట్లతో కార్పొరేట్ తరహాలో భోజనం, సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. బాన్సువాడలో బీఎస్సీ నర్సింగ్ కళాశాల, ఎస్ఆర్ఎన్కే, ఉర్దూ మీడియం డిగ్రీ కళాశాలలు, బీర్కూర్లో జూనియర్ కళాశాల, రుద్రూర్లో ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ కళాశాల, అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కళాశాలలను తీసుకువచ్చారు. తాజాగా బాన్సువాడ పట్టణంలో రూ. 70 లక్షలతో ఉర్దూ మీడియం జూనియర్ కళాశాల, రూ. 2.5కోట్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అన్ని సదుపాయాలతో భవనాలను నిర్మించారు.
పేదింటి ఆడప్లిలల పెండ్లికి రూ.110కోట్లు..
పేదింటి ఆడపిల్లల పెండ్లికి సీఎం కేసీఆర్ ఓ మేనమామలా, పెద్దన్నలా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అందజేస్తున్నారు. ఈ పథకం ద్వారా అప్పులు లేకుండా తల్లిదండ్రులు తమ ఆడపిల్లల పెండ్లిచేసి సంతోషంగా అత్తారింటికి పంపిస్తున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఆడపిల్లల పెండ్లి చేసిన పేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ. 110 కోట్లు అందజేసింది.
అద్దాల్లా మెరుస్తున్న రోడ్లు..
నాడు ఉమ్మడి రాష్ట్రంలో బాన్సువాడ నియోజకవర్గంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా కంకర తేలి, గతుకుల రోడ్లతో నరకం కనిపించేది. ఇప్పుడు.. అవే రోడ్లు హైవేలను తలపిస్తున్నాయి. అద్దాల్లా మెరుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేయడంతో ప్రతి గ్రామానికీ బీటీ రోడ్డు నిర్మించారు. మండలకేంద్రాల నుంచి అటాచ్ రోడ్లన్నీ రెండు లేన్లుగా మార్చారు. బాన్సువాడ- కామారెడ్డి ప్రధాన రహదారి విస్తరణ పనులు కుంటుపడడంతో పోచారం వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సుమారు ఆరు కిలోమీటర్ల మేర ఫారెస్టు క్లియరెన్సు తెచ్చి ఆయా గ్రామాల ప్రజల దశాబ్దాల కల నెరవేర్చారు. దాదాపు రూ. 600 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేశారు.
చివరి ఆయకట్టుకూ సాగునీరు..
బాన్సువాడ నియోజకవర్గంలోని పంటలకు ప్రధాన ఆధారం నిజాంసాగర్ ప్రాజెక్టు. ప్రాజెక్టు పైభాగంలో కర్ణాటక రాష్ట్రం పదుల సంఖ్యలో కొత్త ప్రాజెక్టులు కట్టడంతో నిజాంసాగర్లో నీరురాక వేసవిలో బోసిపోయేది. ప్రస్తుతం కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను నిజాంసాగర్కు తరలించడంతో 365 రోజులూ ప్రాజెక్టు నిండుకుండలా కనిపిస్తున్నది. ప్రాజెక్టు నుంచి విడుదల చేసే నీరు ఒకప్పుడు డిస్ట్రిబ్యూటరీ కాలువల దుస్థితి కారణంగా పంటలకు సరిగా అందేవి కాదు. రూ. 150 కోట్లతో కట్టబలోపేతం, ప్రధాన కాలువను ఆధునీకరించడంతోపాటు డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లకు మరమ్మతులు చేయడంతో ఆయకట్టు చివరిదాకా రెండు పంటలకూ ఢోకా లేకుండా సాగునీరు అందుతున్నది.
చెక్ డ్యాములు.. ఎత్తిపోతలు..
బాన్సువాడ నియోజకవర్గంలోని గట్టుమీది గ్రామాల్లో బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తున్నారు. రూ.150 కోట్లతో చందూర్ ఎత్తిపోతల పథకం, రూ. 200 కోట్లతో సిద్ధాపూర్ జలాశయం నిర్మిస్తుండగా, పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇవి పూర్తయితే నాన్ కమాండ్ ఏరియా అంతా పచ్చటి పైర్లతో సస్యశ్యామలవుతుంది. ఇప్పటికే వరిసాగులో బాన్సువాడ నియోజకవర్గం నంబర్వన్ స్థానంలో ఉండగా, మొత్తం లక్షా 26వేల 65 ఎకరాల్లో పంటను సాగుచేస్తున్నారు. మంజీర పరీవాహక ప్రాంతాల్లో పంటలు సాగు చేసుకునే రైతుల సాగునీటి ఇబ్బందులను దృష్టిపెట్టుకొని నీరు వృథా పోకుండా చెక్ డ్యాములు నిర్మించారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భ జలాలు ఊహించని రీతిలో పెరిగాయి.
నిధులిచ్చిన కేసీఆర్కు ధన్యవాదాలు..
ఉమ్మడి రాష్ట్రంలో బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు నిధుల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డా. ఎంత ప్రయత్నించినా పైసా ఇచ్చేవారు కాదు. ఉమ్మడి పాలన, ప్రత్యేక తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనకు చాలా తేడా ఉన్నది. ప్రజల కష్టాలను తీర్చేందుకు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమ నాయకుడే పాలనా బాధ్యతలు చేపట్టడం కలిసివచ్చింది. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతూ దేశంలోనే నేడు నంబర్వన్ స్థానంలో ఉన్నది. బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధికి సీఎం కేసీఆర్ను ఎన్ని నిధులడిగినా కాదనకుండా ఇచ్చారు. పేదలకు రికార్డు స్థాయిలో డబుల్ బెరూం ఇండ్లు కట్టివ్వడం గర్వంగా ఉన్నది. దేశంలో ఎక్కడా ఇన్ని ఇండ్లు ఉండకపోవచ్చు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు పుష్కలంగా నిధులు కేటాయిస్తున్న సీఎం కేసీఆర్కు బాన్సువాడ నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు.
-పోచారం శ్రీనివాసరెడ్డి, స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే
పోచారం శ్రీనివాసరెడ్డి నిరంతర శ్రామికుడు
బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషిచేసే శ్రామికుడు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. ఆయనను 30 ఏండ్లుగా చూస్తున్నా.. ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటూ వారి కష్టసుఖాలను దగ్గరుండి తెలుసుకుంటారు. వేలకోట్ల రూపాయలతో బాన్సువాడను అభివృద్ధి చేసి ప్రజల మనసు గెలుచుకున్నారు. ప్రతీదీ భావితరాలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తారు.
-డాక్టర్ తుకారం, అసోసియేట్ ప్రొఫెసర్, బాన్సువాడ
అభివృద్ధికి కేరాఫ్గా మారింది..
బాన్సువాడ ప్రాంత ప్రజలు అదృష్టవంతులు. సొంతవారే పట్టించుకోకుండా పోతున్న ఈ రోజుల్లో.. పేదల కోసం ఎన్నో పనులు చేస్తున్న పోచారం శ్రీనివాసరెడ్డి గొప్ప ప్రజా నాయకుడు. ఒకప్పుడు బాన్సువాడ గుడ్డిగుడ్డిగా కనిపించేది. ఇప్పుడుఎటు చూసినా అభివృద్ధి వెలుగులు, పోచారం పనితనం కనిపిస్తుంది.
-సంగ్రాం నాయక్, బంజారా నాయకుడు