కోటగిరి, అక్టోబర్ 22: సీఎం కేసీఆర్ సహకారంతో రూ. 500 కోట్లతో బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, వచ్చే ఎన్నికల్లో తనను మరోసారి ఆశీర్వదించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు. ఆదివారం ఆయన పొతంగల్ మండలం జల్లాపల్లి అబాదిలో సేవాలాల్, జగదాంబ మాత నూతన ఆలయం, విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి తండాలో జగదాంబ మాత, సేవాలాల్ మహరాజ్ ఆలయాల నిర్మాణానికి నిధులు మంజూరుచేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే గ్రామాలు, తండాల అభివృద్ధికి పుష్కలంగా నిధులు వస్తున్నాయన్నారు. బాన్సువాడ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ రూ.500 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇచ్చినట్లు తెలిపారు. తన కుటుంబానికి మొదటి నుంచి బంజారాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. రాజకీయంగా వారు ఎప్పుడూ తన వెంటే ఉంటున్నారని తెలిపారు. నియోజకవర్గంలో 35 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చినట్లు చెప్పారు.
కర్ణాటకలో కరెంటే దిక్కులేదు….
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో మాయ మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. కర్ణాటకలో ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, నేడు అక్కడ కరెంటే దిక్కు లేదన్నారు. తాగునీరు లేక అక్కడి ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని తెలిపారు. కర్ణాటకలోకాంగ్రెస్కు ఓటు వేసి నేడు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకుల మాటలను నమ్మవద్దని సూచించారు. తెలంగాణ అభివృద్ధి కావాలంటే అక్కడ సీఎం కేసీఆర్ ఉండాలని, ఇక్కడ పోచారం ఉండాలని అన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వివేక్, ఉప సర్పంచ్ బీమానాయక్, పౌరదేవి మహరాజ్ బాబూసింగ్, బద్యానాయక్, జడ్పీటీసీ శంకర్పటేల్, వైస్ ఎంపీపీ గంగాధర్పటేల్, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ సిరాజ్, కిశోర్బాబు, ఎంపీటీసీ రాములు, వైస్ ఎంపీపీ వల్లెపల్లి శ్రీనివాసరావు, మండల కన్వీనర్ ఎజాజ్ఖాన్, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.