మోర్తాడ్, మే 22: బాల్కొండ నియోజకవర్గంలో ఇసుకాసురుల ఆగడాలకు అడ్డే లేకుండా పోతున్నది. అధికార యంత్రాంగం కళ్లు మూసుకోవడంతో అక్రమ దందాకు ఎదు రే లేకుండా పోతున్నది. ఇసుక ఇక్రమ రవాణా విషయంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి సీరియస్గా ఉన్నప్పటికీ, మండల స్థాయిలో మాత్రం అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఇసుక దొంగలు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడి తవ్వకాలతో సహజ సంపదను కొల్లగొడుతున్నారు. ఎవరైతే మాకేంటి.. మేం తగ్గేదేలే అన్న రీతిలో రెచ్చిపోతున్నారు. ఇప్పటికే గోదావరి సహా అనేక వాగులు చెరబట్టగా, తాజాగా మోర్తాడ్ మండలం గాండ్లపేట వద్ద వాలిపోయారు. అర్ధరాత్రి వేళ ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. చిమ్మచీకట్లో గుట్టుగా ట్రాక్టర్లలో అక్రమంగా తరలించుకు పోతున్నారు.
సరిగ్గా రెండునెలల క్రితమే గాండ్లపేట్ పెద్దవాగు నుంచి అక్రమ ఇసుక రవాణా కొనసాగింది. ఆ సమయంలోనే నానా రభస జరిగింది. అక్రమ ఇసుక రవాణా విషయంలో రెండువర్గాల మధ్య గొడవలు జరగడం, జరిమానాలు చెల్లించే వరకు పరిస్థితి దిగజారడంతో ఉద్రిక్తత నెలకొన్నట్లు తెలిసింది. ఇటువంటి పరిస్థితుల్లో గాండ్లపేట్లో తిరిగి ఇసుక అక్రమ రవాణా కావడం, ఈ నేపథ్యంలో గ్రామంలో ఎటువంటి గొడవలు జరుగుతాయోనన్న ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతున్నది.
గాండ్లపేట్ పెద్దవాగు నుంచి ఇసుక రవాణాకు అధికారుల అనుమతి అవసరం లేదు. గ్రామ కమిటీకి రూ.50 వేలు చెల్లిస్తే సరిపోతుందని తెలిసింది. ఈ నేపథ్యంలో వీడీసీ డబ్బులు ముట్టజెప్పిన అక్రమార్కులు రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ట్రాక్టర్లతో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. రాత్రి 10 గంటల తరువాత వాగులోకి ట్రాక్టర్లు వెళ్లడం ప్రారంభమవుతుంది, ఉదయం 6 గంటల వరకు అక్రమ రవాణా కొనసాగుతుంది. అక్రమ ఇసుక తవ్వకాలకు జేసీబీని సైతం ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న గాండ్లపేట్ పెద్దవాగులో ఇసుక అక్రమ తవ్వకాలు జరగడం, ఇసుక ట్రాక్టర్లు రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు జాతీయ రహదారిపైనే పయనిస్తున్నా అటు పోలీసులు కానీ, ఇటు అధికారులు కానీ పట్టించుకోక పోవడం అనుమానాలకు తావిస్తున్నది. ఇదే పరిస్థితి శెట్పల్లి గ్రామంలో కూడా కొనసాగుతున్నది. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ఇసుక అక్రమాలపై కింది అధికారులు పట్టించుకోని తరుణంలో కలెక్టర్ స్పందించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. అక్రమ ఇసుక రవాణాకు అసలు సూత్రధారులెవరు, అధికారుల పాత్ర ఏమిటనే అంశాలపై విచారణ జరిపించాలని, అలాగే వీడీసీల వసూళ్లకు బ్రేక్ వేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మోర్తాడ్ మండలంలోని పాలెం పెద్దవాగు నుంచి ఇసుక రవాణాకు అనుమతులు ఉన్నవి. కానీ, గాండ్లపేట్, శెట్పల్లి గ్రామాల నుంచి ఇసుకను తరలించేందుకు ఎటువంటి అనుమతులూ లేవు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటాం.
– కృష్ణ, మోర్తాడ్ తహసీల్దార్