ఇందల్వాయి, అక్టోబర్ 7: అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేస్తామని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. ఇందల్వాయి మండలం కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్తో కలిసి శనివారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. 50 డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి పేదలకు అందజేస్తున్న సీఎం కేసీఆర్కు ఇందల్వాయి ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ ఏ పని చేసినా పేదలు, రైతుల కోసం చేస్తారని అన్నారు. అభివృద్ధి పనులు ప్రజల కండ్ల ముందే ఉన్నాయని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకం దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. ఇది ఒక పెద్ద సాహసమన్నారు. ప్రతి పేదవాడి సొంతింటి కలను నిజం చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఆలస్యమైనా అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్లు కట్టించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేశారు. కార్యక్రమం మధ్యలో ఆగేది కాదని, సీఎం కేసీఆర్ అధికారంలో ఉన్నంతవరకు కొనసాగుతుందన్నారు.
అందరి ప్రేమ, దయ, ఆశీర్వాదంతో కేసీఆర్ వందేండ్లు ఆరోగ్యంగా ఉంటే ఆయన అనుకున్న పనులన్నీ పూర్తవుతాయన్నారు. ప్యాకేజీ 21తో నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సాగు నీరు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
మంచిప్ప చెరువు వద్ద రిజర్వాయర్ నిర్మించుకుని, అక్కడి నుంచి నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి సాగు నీరు అందించే ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణ విషయంలో రైతుల భూములు పోకుండానే రెండు మీటర్ల లోతులో పైపులు వేస్తారని వారు ఆందోళనకు గురికావద్దన్నారు. భావితరాలకు ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే సాగు నీటి కష్టాలు శాశ్వతంగా దూరమవుతాయన్నారు. ఈ విషయంలో కొందరు అడ్డుకునే యత్నాలు చేస్తున్నారని, అయినా వారికి భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ మాట్లాడుతూ.. మండల కేంద్రంలో అన్ని మౌలిక వసతులతో 50 డబుల్ బెడ్ రూం ఇండ్లు ప్రారంభించుకోవడం సంతోషకరమైన విషయమన్నారు. కార్యక్రమంలో ఒలింపిక్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, జడ్పీటీసీ గడ్డం సుమనా రవిరెడ్డి, వైస్ ఎంపీపీ భూసాని అంజయ్య, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు లోలం సత్యనారాయణ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలువేరి దాసు, సర్పంచ్ పాశం సత్తెవ్వ నర్సింహులు, ఎంపీటీసీ మారంపల్లి సుధాకర్, సొసైటీ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్రెడ్డి, ఉపసర్పంచ్ రాజేందర్, రూరల్ ఎస్సీ కన్వీనర్ పాశంకుమార్ తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్కు రుణపడి ఉంటాం
అత్యంత నిరుపేదలకు సీఎం కేసీఆర్ ఇస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లు మాకు ఎంతో ధీమాను కలిగిస్తున్నాయి. గత ప్రభుత్వాలు చేయని పనిని కేసీఆర్ చేసి చూపెడుతున్నారు. నిరుపేదలకు అండగా నిలుస్తూ వారి జీవితాలకు భరోసా కల్పిస్తున్నారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు మా కుటుంబ సభ్యులమంతా జీవితకాలం రుణపడి ఉంటాం.
-ఎడపల్లి చిన్ననడ్పి సాయిలు
నిరుపేదలకు అండగా బీఆర్ఎస్..
నిరుపేదలకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిలుస్తుందని మరోసారి రుజువయ్యింది. మేము ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న సొంతింటి కల సీఎం కేసీఆర్ సహకారంతో నెరవేరింది. ప్రజలకు కావాల్సింది కడుపు నిండా ఆహారం, ఉండడానికి ఇల్లు. ఇవి కేసీఆర్ ప్రభుత్వం వందశాతం అమలు చేస్తున్నది. కేసీఆర్, బాజిరెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.
-దూస మీన
కేసీఆర్ను మా గుండెల్లో పెట్టుకుంటాం..
మా చిరకాల కోరిక నెరవేర్చిన సీఎం కేసీఆర్ను గుండెల్లో పెట్టుకుంటాం. మాలాంటి పేదలు సొంతిల్లు నిర్మించుకోవడం సాధ్యం కాదు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చేతుల మీదుగా డబుల్ బెడ్ రూం ఇంటిని అందించారు. ఇలాంటి పథకం దేశంలోనే లేదు. పేదల కోసం పాటుపడుతున్న కేసీఆర్ ప్రభుత్వానికి ధన్యవాదాలు.
-నగపూర్ లలిత