డిచ్పల్లి, అక్టోబర్ 28: యాభై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు ఒరగబెట్టిందేమీ లేదని, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాతే దళితులను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి, వారికి సమాజంలో మంచి గుర్తింపు తెస్తున్నారని రూరల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండల కేంద్రంలోని జీ-కన్వెన్షన్ హాల్లో శనివారం నిర్వహించిన దళితుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గతంలో రెండుసార్లు నక్సలైట్లు తనను చంపడానికి బుల్లెట్లు దించారని, అయినా భయపడలేదన్నారు. ప్రజల దీవెనలతో భగవంతుడు తనను బతికించాడని తెలిపారు. తనకు ప్రజలే బాస్ అని స్పష్టం చేశారు. రూరల్లో 1100 మందికి దళితబంధు మంజూరు చేశామని, పథకం అందనివారు నిరుత్సాహపడొద్దని, విడుతల వారీగా అందరికీ అందజేస్తామని హామీ ఇచ్చారు. దళితులను కొందరు రెచ్చగొట్టి తనను అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారని మండిపడ్డారు. సమస్య ఉన్న చోటికే వెళ్లి దళితులకు మనోధైర్యం కల్పించానన్నారు. నియోజకవర్గంలో రూ.9.34కోట్లతో 166 ఎస్సీ కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నామని, దళిత వాడల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కోసం రూ. 30కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఓడిపోయిన డాక్టర్ భూపతిరెడ్డి.. ఎన్నికల తర్వాత ప్రజలను గాలికొదిలేసి పారిపోయాడని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు రాగానే దొంగ ఏడ్పులతో మోసం చేసేందుకు మీ ముందుకు వస్తున్నాడని మండిపడ్డారు. ఏడ్చే మగాడిని ఎప్పుడూ నమ్మొద్దన్నారు. బీఎస్పీ అధినేత మాయావతి దళితురాలై ఉండి కూడా బీజేపీకి మద్దతు ఇస్తున్నారని, బీజేపీ అధికారంలో ఉన్న యూపీ, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో దళితులపై అనేక దౌర్జన్యాలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. అలాంటి పార్టీలను దగ్గరికి రానివ్వొద్దని కోరారు.
బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రూరల్ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ మాట్లాడుతూ.. 14 ఏండ్లు పోరాడి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్.. తెలంగాణలో అన్ని వర్గాలకూ సంక్షేమ పథకాలను అందజేస్తున్నారని తెలిపారు. దళితబంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న బాజిరెడ్డి గోవర్ధన్కు అండగా నిలబడి మూడోసారి కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, కమ్మ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కలగర శ్రీనివాస్, బీఆర్ఎస్ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు పద్మారావు, రూరల్ కన్వీనర్ పాశం కుమార్, నాయకులు పాల్గొన్నారు.