బాన్సువాడ, జూన్ 1: కాంగ్రెస్ పార్టీ అడ్డమైన హామీలు ఇచ్చి, అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. రెండున్నరేండ్ల పాలనలో కాంగ్రెస్ సర్కారు పూర్తి వైఫల్యం చెందిందన్నారు. హామీలు అమలు చేయలేక ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న రేవంత్రెడ్డి.. 2034 వరకు తానే సీఎంనని చెప్పుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. సోమవారం బాన్సువాడలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, ‘సర్’పై అవగాహన సమావేశంలో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు,
నియోజకవర్గ ఇన్చార్జి తోట ఆగయ్య తదితరులతో కలిసి బాజిరెడ్డి మాట్లాడారు. కేసీఆర్ సంక్షేమ పథకాలను, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బాజిరెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు. రూ.2 లక్షల రుణమాఫీ, తులం బంగా రం, ప్రతి మహిళకు రూ.2,500 వంటి హామీలు ఎగ్గొట్టిన రేవంత్రెడ్డి తీరును ఇంటింటికీ వెళ్లి వివరించాలన్నారు. ‘సర్’ పేరిట బీఆర్ఎస్లోని ముస్లింల ఓట్లు తొలగించే ప్రయత్నం జరుగుతున్నదని బాజిరెడ్డి ఆరోపించారు. సభ్యత్వ నమోదు ఎంత ఎక్కువ చేపిస్తే పార్టీ గెలుపు అంతా సులువవుతుందని చెప్పారు.
కేసీఆర్ దయతోనే బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని, స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేసిందేమీ లేదని బాజిరెడ్డి విమర్శించారు. ఇక్కడి ప్రజలు కేసీఆర్పై ఉన్న ప్రేమతో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే, పోచారం పోయి కాంగ్రెస్ పార్టీలో చేరిండని మండిపడ్డారు. కేసీఆర్ లక్ష్మీపుత్రుడు అని పేరు పెట్టి, మంత్రిని, స్పీకర్ను చేసి, రూ.కోట్లాది నిధులు ఇచ్చి బాన్సువాడను అభివృద్ధి చేస్తే పోచారం మాత్రం మోసం చేసి పోయిండని ధ్వజమెత్తారు. నాడు విచ్చలవిడిగా దోచుకుతిని, అంతకన్నా ఎక్కువ దోచుకోవడానికే కాంగ్రెస్ పార్టీలో చేరాడన్నారు. పోచారం మళ్లీ బీఆర్ఎస్లోకి వస్తాడని కొందరు ప్రచారం చేస్తున్నారని, కానీ అతడిని తీసుకోబోమని, తీసుకున్నా టికెట్ దక్కదని స్పష్టం చేశారు. బాన్సువాడలో భయపెట్టించే వ్యక్తుల కింద బానిసలుగా ఉంటారా.. లేదో ప్రజలు, నాయకులే తేల్చుకోవాలన్నారు.
రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని మొక్కవోని దీక్షతో తెలంగాణ సాధించాడని, సాధించిన తెలంగాణను అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్వన్గా నిలిపారని బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు, బాన్సువాడ నియోజకవర్గ సభ్యత్వ నమోదు పరిశీలకుడు తోట ఆగయ్య అన్నారు. సర్ ప్రక్రియను బూత్ సభ్యులు, సమన్వయ కమిటీ సభ్యులు దగ్గరుండి చూడాలని సూచించారు. పిడికెడంత మంది పనిచేసే వాళ్లు ఉంటే చాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రలజకు వివరించి, బీఆర్ఎస్ పార్టీని గెలిపించిన వాళ్లం అవుతామని చెప్పారు.
అధికార పార్టీ వారికి భయపడితే ప్రయోజనం ఉండదని, కష్టపడి ఎదురొడ్డే వారు మాత్రమే కమిటీ సభ్యులుగా కొనసాగాలన్నారు. పార్టీని మోసం చేసిన వారిని పక్కన పెట్టి, కేసీఆర్ బొమ్మ గుండెల మీద పెట్టుకొని, పార్టీ కోసం పనిచేసే వారికి నాయకత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మళ్లీ పాత రోజులు రావాలని, బాన్సువాడలో గులాబీ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నేతలు దుద్దిళ్ల అంజిరెడ్డి, జుబేర్, మున్సిపల్ కౌన్సిలర్లు ఖతీల్, ఫిరోజ్, మక్బూల్, మాజీ వార్డు సభ్యులు బాడి శ్రీనివాస్, అక్బర్,ఆయా మాధవరెడ్డి, ధర్మతేజ, ఎర్రవట్టి సాయిబాబా పాల్గొన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీ టీమ్గా మారిందని ఉమ్మడి జిల్లా సభ్యత్వ నమోదు ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్ అన్నారు. రెండు పార్టీలు కలిసి లోపాయికారీగా పని చేస్తున్నాయన్నారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన సమావేశంలో తనతో కలిసి రావాలని ప్రధాని మోదీ సీఎం రేవంత్రెడ్డిని ఆహ్వానించడం ప్రజలంతా చూశారని, దీంతో ఆ రెండు పార్టీలు కలిసే ఉన్నాయని అందరికీ అర్థమైందన్నారు.
వడ్ల కాంటాలు పెట్టకుండా రేవంత్రెడ్డి మాటలు చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోవడం లేదని, జూన్ వచ్చినా ఇంకా వడ్ల కొనుగోళ్లు పూర్తి కాలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఏప్రిల్ చివరి నాటికే కొనుగోళ్లు పూర్తి చేసిన ఘనత కేసీఆర్దని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేయక పోవడంతో అకాల వర్షాలతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని వీజీగౌడ్ స్పష్టం చేశారు.
పార్టీ బలోపేతం కోసం కార్యకర్త నుంచి సమన్వయ కమిటీ సభ్యుడి వరకు ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని సూచించారు. ‘సర్’ ప్రక్రియపై జాగ్రత్తగా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారి ఓట్లు తీసే ప్రయత్నం చేస్తారని, పార్టీ సమన్వయ కమిటీ, బూత్ స్థాయి సభ్యులు అప్రమత్తంగా ఉండి ఇలాంటి వాటిని అడ్డుకోవాలన్నారు. జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లిన వారి ఓట్లు తొలగించకుండా చూస్తామని చెప్పారు.