డిచ్పల్లి, నవంబర్ 2 : బీఆర్ఎస్ ప్రభుత్వం గౌడ కులస్తుల సంక్షేమానికి కృషిచేస్తున్నదని, సీఎం కేసీఆర్తో మాట్లాడి గౌడ కులాన్ని బీసీబంధు పథకంలో చేర్పించేందుకు కృషిచేస్తానని బీఆర్ఎస్ రూరల్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ హామీఇచ్చారు. డిచ్పల్లి మండలకేంద్రంలోని ఎస్ఎల్జీ గార్డెన్స్లో గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాజిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో ఏకైక బీసీ నాయకుడిని తానేనని, తనకు అండగా ఉండి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గౌడ కులస్తులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. చెట్టు పన్ను పేరుతో గౌడ కులస్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ చెట్టు పన్నును రద్దు చేశారని తెలిపారు. ప్రస్తుతం కులవృత్తిని ఆధారంగా చేసుకొని గౌడ కులస్తులు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారని అన్నారు. ప్రజలకు కల్తీలేని కల్లును అందించడానికి ప్రభుత్వం ఈత, తాటివనాల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నదన్నారు. గతంలో గౌడ కులస్తులు తాటిచెట్టుపై నుంచి పడి మృతిచెందింతే రూ.2 లక్షలు ఇన్సూరెన్స్ ఇచ్చేవారని, బీఆర్ఎస్ ప్రభుత్వం దానిని రూ.5 లక్షలకు పెంచిందని చెప్పారు. డిచ్పల్లిలో తెలంగాణ యూనివర్సిటీ, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉన్న దృష్ట్యా బీసీ హాస్టల్ నిర్మాణం కోసం రూ.కోటి నిధులు మంజూరుకు కృషిచేస్తానన్నారు. సీఎం కేసీఆర్ కొత్తగా ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోతో రాష్ట్రంలోని 90 లక్షల మందికి రూ. 5లక్షల బీమా సౌకర్యం లభిస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రూరల్ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ వి.గంగాధర్గౌడ్ మాట్లాడుతూ.. ప్రజల కోసం నిత్యం పనిచేసే బాజిరెడ్డిగోవర్ధన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, గౌడ సంఘం నాయకులు రాజాగౌడ్, సురేందర్గౌడ్, జయసింహాగౌడ్, శ్యాంసుందర్గౌడ్, ప్రపాద్గౌడ్, పర్శాగౌడ్, నర్సాగౌడ్, నారాగౌడ్, గంగాధర్గౌడ్, శేఖర్గౌడ్, శ్రీనివాస్గౌడ్, లక్ష్మణ్గౌడ్ పాటు ఏడు మండలాల గౌడ కులస్తులు పాల్గొన్నారు.
కిస్ట్రియన్లను గత పాలకులు పట్టించుకోలేదని రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. డిచ్పల్లిలోని ఎస్ఎల్జీ గార్డెన్లో గురువారం రాత్రి రూరల్ నియోజకవర్గ క్రిస్టియన్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా.. బాజిరెడ్డి హాజరై మాట్లాడారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత క్రిస్మస్ను అధికారికంగా నిర్వహించడంతోపాటు నూతన వస్ర్తాలను పంపిణీ చేస్తున్నామని, చర్చిలకు భారీగా నిధులు మంజూరు చేశామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పే కల్లబొల్లి మాటలను నమ్మి మోసపోవద్దన్నారు. రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ రాజేశ్వర్ రావు మాట్లాడుతూ.. మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని క్రిస్టియన్లు ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రూరల్ పాస్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.