తెరుచుకున్న బాబ్లీ గేట్లు..
కేంద్ర బృందం ఆధ్వర్యంలో దిగువకు నీటి విడుదల
నదిలో పెరిగిన నీటిమట్టం
మెండోరా, జూలై 1 : ఎస్సారెస్పీకి ఎగువన మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు వరదగేట్లను శుక్రవారం ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఉదయం 8 గంటలకు సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారుల సమక్షంలో గేట్ల ఎత్తివేత ప్రక్రియ కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్సారెస్పీ ఈఈ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. బాబ్లీ ప్రాజెక్టు పూర్తిసామర్థ్యం 2.7 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ఒక టీఎంసీ నీటి నిల్వ ఉన్నదని తెలిపారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం 14 గేట్లను ఎత్తి ఎస్సారెస్పీ దిశగా గోదావరిలోకి నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చౌగలే, బాబ్లీ డ్యాం అధికారి తానత్ కేత్కర్, శ్రీనివాస్రావు, ఏఈఈలు రవి, వంశీ ఉన్నారు. ఎస్సారెస్పీలో ప్రస్తుతం 23.432 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు.
త్రివేణి సంగమానికి జలకళ..
రెంజల్, జూలై 1 : బాబ్లీ ప్రాజెక్టు వరద గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో గోదావరిలో నీటి ప్రవాహం పెరిగింది. రెంజల్ మండలంలోని కందకుర్తి సమీపంలో ఉన్న త్రివేణి సంగమక్షేత్రానికి జలకళ సంతరించుకున్నది. నీటి విడుదల నేపథ్యంలో గోదావరి తీరప్రాంత ప్రజలను సైరన్ ద్వారా అధికారులు అప్రమత్తం చేశారు. ఉదయం నుంచి నీటి మట్టం వేగంగా పెరుగుతున్నది. కందకుర్తి వంతెన వద్ద గోదావరి నురుగులతో ఉధృతంగా ప్రవహిస్తున్నది. నదికి ఇరువైపులా రేవులను తాకుతూ ప్రవహించిన నీరు.. పురాతన శివాలయం చుట్టూ చేరింది.
తీరంలో భక్తుల సందడి
కందకుర్తి వద్ద గోదావరి తీరం.. భక్తులతో సందడిగా కనిపించిది. పౌర్ణమి చివరి శుక్రవారం సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించేందుకు భారీగా తరలివచ్చారు. పిండి వంటలతో నైవేద్యాలు తయారుచేసి గంగమ్మ తెప్పల్లో సమర్పించారు. పురాతన శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.