ప్రతిఏటా జూలై ఒకటిన గేట్లు తెరువాలని అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు
సీడబ్ల్యూసీ అధికారుల పర్యవేక్షణలో నీటి విడుదల
మెండోరా, జూన్ 30 : నేడు బాబ్లీ గేట్లు తెరుచుకోనున్నాయి. మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం శుక్రవారం ఎత్తనున్నారు. సీడబ్ల్యూసీ అధికారుల పర్యవేక్షణలో తెలంగాణ, మహారాష్ట్ర అధికారులు గేట్లను ఎత్తడానికి సన్నద్ధమయ్యారు. ఎస్సారెస్పీకి 80 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్రలోని ధర్మాబాద్ సమీపంలో బాబ్లీ ప్రాజెక్టును నిర్మించారు. దీంతో ఎస్సారెస్పీకి వచ్చే వరదకు అడ్డుకట్ట పడిందని, ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారే అవకాశముందంటూ గత ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. ప్రతిఏటా జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం గేట్లు ఎత్తనున్నారు. బాబ్లీ గేట్ల ఎత్తివేత, మూసివేత ప్రక్రియలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అధికారులతో పాటు సీడబ్ల్యూసీ (సెంట్రల్ వాటర్ కమిషన్) అధికారులు పాల్గొని సుప్రీం తీర్పును అమలు చేయాల్సి ఉంటుంది. ఈ తీర్పు ప్రకారం జూన్ 30న అర్ధరాత్రి 12 గంటల నుంచే గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయాలి. అర్ధరాత్రి ప్రాజెక్టుకు చేరుకోవడం ఇబ్బందుల నేపథ్యంలో జూలై 1న గేట్లను ఎత్తుతున్నారు. జూలై 1న ఉదయం వరకు ఎస్సారెస్పీ అధికారులు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చక్రపాణి, డీఈ, ఏఈఈ రవి, వంశీ బాబ్లీ ప్రాజెక్టుకు వెళ్లి నీటి విడుదల పర్యవేక్షణలో పాల్గొంటారని ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు.
బాబ్లీలో ఒక టీఎంసీ నీరు
బాబ్లీ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 2.7 టీఎంసీలు కాగా గురువారానికి ఒక టీఎంసీ నీటి నిల్వ ఉంది. గేట్లు ఎత్తితే గోదావరి ద్వారా నీరు ఎస్సారెస్పీలోకి చేరుతుంది. గతేడాది బాబ్లీ ప్రాజెక్టులో సీజన్ ప్రారంభంలోనే అత్యధిక వర్షాలు కురిసి పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. వరద ఎక్కువ కావడంతో దిగువకు 14 గేట్లను క్రమంగా ఎత్తి నీటిని విడుదల చేశారు. ఈ ఏడాది ఆ పరిస్థితి లేకపోవడంతో ప్రాజెక్టులో నీటి మట్టం ఆశించిన స్థాయిలో లేదు. బాబ్లీ గేట్లను సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం శుక్రవారం ఎత్తుతున్న నేపథ్యంలో గోదావరి తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని ఎస్సారెస్పీ సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రీనివాస్ సూచించారు.