కామారెడ్డి, ఫిబ్రవరి 4: గర్భస్థ పిండ పరీక్షల నియంత్రణపై స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు, ఐఎంఏ, రెడ్క్రాస్ ప్రతినిధులు, జిల్లా అధికారులు, పీహెచ్సీ వైద్యులకు మూడు నెలలకోసారి అవగాహన కల్పించాలని జిల్లా న్యాయమూర్తి శ్రీదేవి సూచించారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గర్భధారణ, గర్భస్థ పిండ పరీక్షల నియంత్రపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ప్రతినెలా స్కానింగ్ కేంద్రాలను జిల్లా స్థాయి వైద్యాధికారులు తనిఖీలు చేయాలని సూచించారు. గ్రామ స్థాయిలో పోలీసు, ఆరోగ్యశాఖ అధికారులు సమన్వయంతో లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మాట్లాడుతూ… జిల్లాలో 28 స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. అన్ని స్కానింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఉండేలా చూడాలన్నారు. ప్రైవేట్ దవాఖానల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేసి వివరాలు తెలియజేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడిషనల్ ఎస్పీ అన్యోన్య, జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్, వైద్యురాలు శిరీష, జిల్లా రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న,అధికారులు వేణుగోపాల్, చలపతి పాల్గొన్నారు.