రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఆ గ్రామాలు పక్కాగా వినియోగించుకుంటున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందేలా పాలకవర్గాలు కృషి చేస్తున్నాయి. దీంతో ఆ గ్రామాలు రాష్ట్రస్థాయిలో ఉత్తమ పంచాయతీ అవార్డుకు ఎంపికయ్యాయి నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని కుకునూర్, కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని రైతునగర్ గ్రామ పంచాయతీలు.
నీటి యాజమాన్యంలో కుకునూర్..
గతంలో కుకునూర్ గ్రామ ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొన్నారు. మంత్రి ప్రశాంత్రెడ్డి కృషితో స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామంలోని నీటి సమస్య ను పరిష్కరించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాలను ఏర్పాటుచేసి ప్రతి రోజూ శుద్ధమైన జలాలను అందిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, పంచాయతీ అధికారుల పనితీరును గుర్తించిన ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో ఉత్తమ పంచాయతీగా ఎంపిక చేసింది. ఈ మేరకు నేడు శుక్రవారం హైదరాబాద్లో అవార్డును అందజేయనున్నారు.
ప్రతి ఇంటికీ నల్లా..
గ్రామానికి సమీపంలోనే పెద్దవాగు ఉన్నా.. గ్రామస్తులకు నీటి కష్టాలు ఉండేవి. పొలాల్లోకి వెళ్లి బోరుబావుల నుంచి నీటిని తెచ్చుకునే వారు. విషయాన్ని మంత్రి ప్రశాంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో సమస్యకు పరిష్కారం లభించింది. గ్రామంలో మొత్తం 404 ఇండ్లు ఉండగా.. ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నల్లాను ఏర్పాటుచేయించారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం రెండు పూటలా నీటిని సరఫరా చేస్తున్నారు. పైప్లైన్ లీకేజీలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ, ఏ సమస్య ఏర్పడినా వెంటనే పరిష్కరిస్తున్నారు. దీంతో వీరి పనితీరును గుర్తించిన అధికారులు 2021-22 సంవత్సరానికి గాను ఆదర్శ గ్రామ యోజన పథకం కింద నీటి యాజమాన్యం కేటగిరిలో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికచేశారు. దీంతో గ్రామస్తులందరూ సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు..
ఐదు విడుతలుగా చేపట్టిన పల్లెప్రగతితో గ్రామ స్వరూపం పూర్తిగా మారింది. ఎక్కడ చూసినా పచ్చదనం, పరిశుభ్రత కనిపిస్తున్నది. హరితహారంలో భాగంగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. డంపింగ్ యార్డు, వైకుంఠధామం, ట్రాక్టర్ ఏర్పాటు తదితర సౌకర్యాలు సమకూరాయి.
సామాజిక భద్రత పంచాయతీ ‘రైతునగర్’..
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను ఆ గ్రామంలో పక్కాగా అమలుచేస్తున్నారు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా పాలకులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, అమ్మ ఒడి, కేసీఆర్, న్యూట్రిషన్ కిట్టు, ఆరోగ్య మహిళ, రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలు అర్హులకు చేరుతున్నాయి. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ముందు వరుసలో ఉండడంతో సామాజిక భద్రత విభాగంలో రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డుకు ఎంపికైంది బీర్కూర్ మండలంలోని రైతునగర్ గ్రామ పంచాయతీ.
రైతునగర్ గ్రామ నేపథ్యం..
అప్పటి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి నుంచి వలస వచ్చిన పలువురు బీర్కూర్ ప్రాంతంలో మంజీర పరీవాహక ప్ర దేశం ఉండడంతో వ్యవసాయ పనులు చేసుకుంటూ గ్రామాన్ని ఏర్పాటుచేసుకున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన శివయ్య మొదటగా 1946లో ఇక్కడికి వచ్చినట్లు గ్రామస్తులు చెబుతుంటారు. ప్రస్తుతం గ్రామ మొత్తం జనాభా 879 కాగా.. వీరిలో 441 మంది పురుషులు, 429 మంది మహిళలు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఈ గ్రామాన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటుచేసింది.
రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు..
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కృషితో మా గ్రామ పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం పుష్కలంగా నిధులను మంజూరు చేస్తున్నది. రూ.50లక్షలతో కల్యాణ మండపం, రూ.20లక్షలతో గ్రామ పంచాయతీ భవనం, రూ.పది లక్షలతో అంగన్వాడీ భవనాన్ని నిర్మించుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– సిద్ధార్థ, ఉప సర్పంచ్, రైతునగర్
సమయానికి పింఛన్ వస్తుంది..
అప్పటోళ్లకు సరైన టైమ్ల పింఛన్ డబ్బులు వచ్చేటివి కాదు. ఇప్పుడు ప్రతినెలా సమయానికి ఆసరా పింఛన్ అందుతున్నది. వృద్ధులకు పింఛన్లు మంజూరు చేసి, పంచాయతీ సిబ్బంది తెచ్చి ఇవ్వడం ఆనందంగా ఉన్నది. మా పంచాయతీకి అవార్డు రావడం సంతోషం. మరిన్ని అవార్డులు అందుకుంటది.
– శేషమ్మ, వృద్ధురాలు, రైతునగర్
నేషనల్ అవార్డునూ అందుకుంటాం..
గ్రామ పంచాయతీ పరిధిలో హరితహారం నుంచి పల్లెప్రగతి వరకు ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను వంద శాతం పూర్తిచేస్తున్నారు. స్పీకర్ సహకారంతో అన్ని పనుల్లో ముందు వరుసలో ఉంటూ రాష్ట్రస్థాయిలో అవార్డు పొందిన మా గ్రామ పంచాయతీ నేషనల్ అవార్డును కూడా అందుకుంటది.
– కుమార్, గ్రామ పెద్ద, రైతునగర్
నీటి సమస్య లేకుండా చేశాం..
గతంలో గ్రామంలో నీటి గోస ఉండేది. ప్రస్తుతం గ్రామంలోని ప్రతి ఇంటికీ నల్లాను ఏర్పాటు చేయించాం. ప్రతి రోజూ నీటిని అందిస్తున్నాం. మేము చేస్తున్న పనులను గుర్తించిన అధికారులు రాష్ట్రస్థాయిలో ఉత్తమ పంచాయతీగా ఎంపిక చేయడం గర్వంగా ఉన్నది.
– విజయ, సర్పంచ్, కుకునూర్
నీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తున్నాం..
గ్రామంలో ఒక్కరోజు కూడా నీటి సరఫరాలో ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. గ్రామంలో నీటి సరఫరాలో ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం. మా గ్రామానికి రాష్ట్రస్థాయిలో అవార్డు రావడం ఆనందంగా ఉన్నది.
– ఆశ, పంచాయతీ కార్యదర్శి, కుకునూర్
మంత్రి చొరవతో నీటి గోస లేదు..
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చొరవతో కుకునూర్ గ్రామంలో నీటి గోస లేకుండా పోయింది. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లాను ఏర్పాటు చేయడంతో ప్రతి రోజూ స్వచ్ఛమైన నీరు అందుతున్నది. గ్రామస్తులంతా సంతోషంగా ఉన్నారు.
– బోదేపల్లి సురేశ్, వైస్ ఎంపీపీ