వినాయక్నగర్, మార్చి 14: ఆటో సరిగ్గా నడవడం లేదని తీవ్ర మనస్తాపానికి గురై స్వామి అనే ఆటోడ్రైవర్ తన భార్యను చంపి, ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. బుధవారం చోటుచేసుకున్న ఈ సంఘటన జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించగా..రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దంపతులిద్దరు తనువు చాలించడంతో వారి ఒక్కాగానొక్క కొడుకు ఒంటరివాడయ్యాడు.
దంపతుల మృతదేహాలకు గురువారం అంత్యక్రియలు నిర్వహించగా.. కెనాల్ కట్ట ప్రాంతం నుంచి ఖిల్లా శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర నిర్వహించారు. ఒకే వాహనంపై స్వామి దంపతుల మృతదేహాలను ఉంచి చేపట్టిన అంతిమయాత్రలో కుటుంబ సభ్యులతోపాటు సన్నిహితులు, కాలనీవాసులు, బంధువులు పాల్గొని కన్నీరుమున్నీరుగా విలపించారు. గుండెలవిసేలా రోదించిన కొడుకు మల్లికార్జున్ను చూసిన ప్రతి ఒక్కరి హృదయం ద్రవించింది. తల్లిదండ్రులను కోల్పోయి, ఎవరూలేక అనాథగా మారిన మల్లికార్జున్ను ఎవరైనా ఆదుకోవాలని అతడి మేనమామ ఒగ్గు మధు కోరాడు.
‘అమ్మా నాన్న.. ఇక నాకు దిక్కెవరు.. నన్ను ఒంటరివాడిని చేసి వెళ్లిపోయారు..నన్ను చేరదీసేవారెవరు..నాకు దిక్కేంది.. తొవ్వేంది.. నాకు తోబుట్టువులు కూడా లేరు.. ఎవరి చెంతకు వెళ్లాలి..’ అంటూ తల్లిదండ్రులను తలుచుకుంటూ కొడుకు మల్లికార్జున్ బోరున విలపించాడు. ‘నన్ను ఎవరైనా ఒక్కరోజు జూత్తరు..రెండు రోజులు చూస్తరు..మూడోన్నాడు గెంటేస్తే నేను యాడికిపోవాలి..’ అంటూ విలపించడం అక్కడున్నవారిని కదలించింది.