ఖలీల్వాడి, నవంబర్ 15 : ఇందూరు నగర శివారులోని మల్లారం వద్ద ఏర్పాటు చేసిన ధాత్రి టౌన్షిప్లో ప్లాట్ల విక్రయాల కోసం వేలం మంగళవారం ముగిసింది. న్యూ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బహిరంగ వేలం నిర్వహించారు. మొదటి రోజైన సోమవారం 40 ప్లాట్లకు సంబంధించిన వేలం పూర్తవగా, మంగళవారం కలెక్టర్ నారాయణరెడ్డి నేతృత్వంలో మిగతా 40 ప్లాట్లకు ఓపెన్ యాక్షన్ నిర్వహించారు. బిడ్డర్లు ఉత్సాహంగా వేలంలో పాల్గొన్నారు. అన్నింటికి మించి డీటీసీపీ అఫ్రూవ్డ్ లేఅవుట్ కలిగిన వెంచర్ కావడం, ఎలాంటి చిక్కులు లేకుండా ప్రభుత్వమే ప్లాటింగ్ చేయడం, నిజామాబాద్ నగరానికి చేరువలో ఉండడంతో తమకు నచ్చిన ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు.
సోమవారంతో పోలిస్తే చివరి రోజైన మంగళవారం ఆయా ప్లాట్లను దక్కించుకునేందుకు బిడ్డర్లు వేలంలో పోటీ పడ్డారు. దీంతో ప్రభు త్వం నిర్ణయించిన ప్రారంభ ధర ఎనిమిది వేల రూపాయలుంటే, తొమ్మిది వేల పైచిలుకు ధరకు ప్లాట్లు విక్రయించబడ్డాయి. కొన్ని ప్లాట్లు చదరపు గజానికివేలంలో అత్యధికంగా 9500 రూపాయల ధర పాడి ఔత్సాహిక బిడ్డర్లు దక్కించుకున్నారు. మొదటి రోజు తరహాలోనే డీడీని స్వీకరిస్తూ టోకెన్లు దరఖాస్తు ఫారాలు అందించారు. టోకెన్ కలిగిన వారిని వేలంలో పాల్గొనేందుకు అనుమతించారు. అధిక ధర పాడిన వారికి ప్లాట్ ఖరారైనట్లు అధికారులు కేటాయింపు లేఖలు అందజేశారు. వారం వ్యవధిలో 33 శాతం మొత్తాన్ని, 45 రోజుల్లో మరో 33 శాతం రుసుమును, 90 రోజుల్లో మిగతా మొత్తాన్ని చెల్లించాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. మొత్తం 80 ప్లాట్లకు వేలం నిర్వహించగా బిడ్డర్లు 20 ప్లాట్లను కొనుగోలు చేశారు.
త్వరలోనే రెండో విడుత వేలం నిర్వహిస్తాం : కలెక్టర్
ముందుగా ప్రకటించిన మేరకు ధాత్రి టౌన్షిప్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కలెక్టర్ నారాయణరెడ్డి భరోసా కల్పించారు. వేలంలో పాల్గొని ప్లాట్లు దక్కించుకున్న వారికి అభినందనలు తెలిపారు. త్వరలోనే రెండో విడుత ప్లాట్ల విక్రయాల కోసం బహిరంగ వేలం నిర్వహిస్తామని కలెక్టర్ ప్రకటించారు. వేలం ప్రక్రియలో నిజామాబాద్ ఆర్డీవో రవి, టీఎస్ఐఐసీ జిల్లా మేనేజర్ దినేశ్, తహసీల్దార్ అనిల్, సుదర్శన్, రషీద్ పాల్గొన్నారు.
నచ్చిన ప్లాట్లు, గృహాలు రాకపోతే..బుధవారం వేలంలో పాల్గొనవచ్చు
నచ్చిన ప్లాట్లు,గృహాలు రాకపోతే బుధవారం వేలంలో పాల్గొనవచ్చని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు.కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం ధరణి టౌన్ షిప్లో ప్లాట్లు, గృహాలకు వేలం నిర్వహించారు. ధరణి టౌన్ షిప్లోని ప్లాట్లు,వివిధ దశలలో నిర్మాణం పూర్తి అయిన గృహాలకు ప్రత్యక్ష వేలం ఉంటుందన్నారు.
ఆసక్తి ఉన్న వారు వేలం పాటలో పాల్గొని తమ సొంతింటి కలను నెరవేర్చుకోవాలని సూచించారు. మంగళవారం 56 ప్లాట్లు,9 గృహాలకు వేలం నిర్వహించినట్లు తెలిపారు. 9 ప్లాట్లు, రెండు గృహాలు విక్రయించగా రూ. 1.63 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. సమావేశంలో జోనల్ మేనేజర్ రామ్దాస్,ఏవో రవీందర్,అధికారులు పాల్గొన్నారు.