డిచ్పల్లి, ఏప్రిల్ 6 : జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన టోల్ప్లాజాల వద్ద వాహనదారుల పై మరోసారి చార్జీల మోత మోగింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది. ఎన్హెచ్ఏఐ (జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) ప్రతియేటా టోల్ చార్జీలను సవరించే క్రమంలో ఈసారి వాహనదారులపై 5.50 శాతం వడ్డించింది. ఈ కారణంగా వాహనదారులపై చార్జీల భారం భారీగా పడనున్నది.
ఇందల్వాయి టోల్ప్లాజా మీదుగా ప్రతినిత్యం 15 నుంచి 20వేల వాహనాలు ప్రయాణిస్తుంటాయి. వీటిలో దాదాపు 60 శాతం కార్లు వెళ్తుంటాయి. ఇవే కాకుండా భారీ ట్రక్కులు, బస్సులు, ఇతర వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటి ద్వారా నిత్యం రూ.25 నుంచి 30లక్షల వరకు టోల్చార్జీలు వసూలు అవుతున్నట్లు అంచనా. తాజాగా మరోసారి 5.50 శాతం చార్జీలు పెరగడంతో రోజుకు సుమారు రూ.లక్షన్నర వరకు అదనంగా వాహనాలపై భారం పడనున్నది. ఇప్పటికే గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలను పెంచి ప్రజలపై భారం మోపిన కేంద్రం తాజాగా టోల్ చార్జీలను పెంచి మరింత భారం వేసింది.
ఎన్హెచ్ఏఐకి ఏటా కోట్లల్లో ఆదాయం వస్తున్నా టోల్ప్లాజాల వద్ద మాత్రం సౌకర్యాలు కల్పించడం లేదు. దీనిపై స్థానికులు ఏండ్లుగా ప్రశ్నిస్తున్నా ఎన్హెచ్ఏఐ పట్టించుకోవడం లేదు. రహదారుల నిర్వహణ విషయంలో కేంద్ర ప్రభుత్వం టోల్ప్లాజాలను ప్రైవేటు సంస్థలకు గతంలో అప్పగించిన విషయం అందరికీ తెలిసింది. ఈ రహదారుల నిర్వహణ విషయమై కాంట్రాక్టు తీసుకున్న సంస్థ చార్జీలతో పాటే సౌకర్యాల కల్పనపైన కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే స్థానికంగా పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల వాసులు వారికి కల్పిస్తున్న సౌకర్యాలపై పెదవి విరుస్తున్నారు. జాతీయ రహదారి నిర్మాణం సమయంలో ఇచ్చిన హామీలపై ఏండ్లుగా అడుగుతున్నా స్పందించడం లేదని మండిపడుతున్నారు. ప్రధానంగా సర్వీసు రోడ్ల నిర్మాణం, అండర్ పాస్ల వద్ద లైటింగ్ , డ్రైనేజీల నిర్వహణ సరిగ్గా లేకపోవడం వంటివి ప్రధానంగా ఉన్నాయి. వీటి లోపం కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
కారు, జీపు, వ్యాను, లైట్ మోటర్ వెహికిల్స్కి గతంలో సింగిల్ జర్నీకి రూ.80, రిటర్న్ జర్నీకి రూ.125, నెల పాస్కి రూ.2,720 ఉండగా 5.50 శాతం పెంచిన తర్వాత సింగిల్ జర్నీకి రూ.85, రిటర్న్ జర్నీకి రూ.130, నెల పాస్కి రూ.2,860 చేరింది. లైట్ కమర్షియల్ వెహికిల్, లైట్ గూడ్స్ వెహికిల్, మినీ బస్సులకు గతంలో సింగిల్ జర్నీకి రూ.130, రిటర్న్ జర్నీకి రూ.200, నెల పాస్కి రూ.4,395 ఉండగా సవరించిన చార్జీల ప్రకారం సింగిల్ జర్నీకి రూ.140, రిటర్న్ జర్నీకి రూ.210, నెల పాస్కి రూ.4,620లకు పెరిగింది. బస్సు, ట్రక్కులకు గతంలో సింగిల్ జర్నీకి రూ.275, రిటర్న్ జర్నీకి రూ.415, నెల పాస్కి రూ.9,215 ఉండగా ఇప్పుడు సింగిల్ జర్నీకి రూ.290, రిటర్న్ జర్నీకి రూ.435, నెల పాస్కి రూ.9,680లకు పెరిగింది. హెవీ కన్స్ట్రక్షన్ మెషినరీ, ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్, మల్టీ ఎక్సెల్ వెహికిల్స్కి గతంలో సింగిల్ జర్నీకి రూ.435, రిటర్న్ జర్నీకి రూ.650, నెల పాస్కి రూ.14,450 ఉండగా సింగిల్ జర్నీకి రూ.455, రిటర్న్ జర్నీకి రూ.685, నెల పాస్కి రూ.15,180లకు పెరిగింది. ఓవర్ సైజ్ వెహికిల్స్కి గతంలో సింగిల్ జర్నీకి రూ.530, రిటర్న్కి రూ.790, నెల పాస్కి రూ.17,590 ఉండగా సింగిల్ జర్నీకి రూ.555, రిటర్న్ జర్నీకి రూ.830, నెల పాస్కి రూ.18,480కి పెరిగింది.
ఇందల్వాయి టోల్ప్లాజాకు సమీపంలో ఉన్న మా గన్నారం గ్రామ వాసులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఏండ్లుగా అడుగుతున్నాం. అయినా ఎన్హెచ్ఏఐ వారు పట్టించుకోవడం లేదు. ప్రధానంగా గ్రామ స్టేజీ వద్ద యూటర్న్ అత్యంత ప్రమాదకరంగా ఉంది. దీని విషయంలో చర్యలే లేవు. అలాగే గ్రామస్తులకు ఫ్రీ పాసులు ఇవ్వాలని మొదట్లోనే అడిగాం. అయినా ఇప్పటి వరకు ఇవ్వలేదు. టోల్ చార్జీలు కోట్లల్లో వసూలు చేస్తున్నారు మాకు మాత్రం సౌకర్యాలు కల్పించడం లేదు.
ఎం.గంగాధర్గౌడ్, మాజీ ఎంపీటీసీ, ఇందల్వాయి
ఇందల్వాయి మండల కేంద్రంలో జాతీయ రహదారిపై లైటింగ్ సరిగ్గా లేదు. ఫ్లైఓవర్ కింది నుంచి రాత్రి సమయాల్లో వెళ్తుంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చీకట్లో ఏ ప్రమాదం జరుగుతుందోనని చాలా మంది భయపడుతున్నారు. ఈ విషయంలో యాజమాన్యానికి చాలా సార్లు చెప్పాం. అయినా మా మాట వినడం లేదు. దీనిపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పట్టించుకొని లైటింగ్ వ్యవస్థను మెరుగుపర్చాలి.
-లింగంపల్లి రాజేందర్, ఉపసర్పంచ్, ఇందల్వాయి