ఆర్మూర్టౌన్/మాక్లూర్, ఫిబ్రవరి 9: కాంగ్రెస్ పార్టీ హామీలు, మాయ మాటలకు మరోసారి మోసపోవద్దని, పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి బీఆర్ఎస్ పార్టీకి ఓటువేయాలని మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి కోరారు. ఆర్మూర్ పట్టణంతోపాటు మాక్లూర్ మండలంలోని మానిక్బండార్, బోర్గాం(కే) గ్రామాల్లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ.. గడిచిన రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆరు గ్యారంటీల అమలులో విఫలమైందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలోనే గ్రామాలకు కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేశానని తెలిపారు.
రైతు రుణమాఫీ, తులం బంగారం, రైతులకు బోనస్, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని హామీలిచ్చిన కాంగ్రెస్ ఇప్పటివరకు అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందేనని, ఆ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేశాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో 2వ డివిజన్ అభ్యర్థి అశోక్, మాజీ జడ్పీటీసీ ఆకుల విజయ, నాయకులు ఆకుల రజనీష్, నర్సాగౌడ్, సురేశ్, గంగాధర్గౌడ్, కృష్ణ, రవీందర్నాయక్, రాము పాల్గొన్నారు. అంతకుముందు ఆర్మూర్లో నిర్వహించిన బైక్ర్యాలీలో జీవన్రెడ్డి పాల్గొన్నారు.