తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన ‘తెలంగాణ రన్’ ఉత్సాహంగా సాగింది. అన్ని వర్గాల వారు పరుగులో పాల్గొని సమైక్యతను చాటి చెప్పారు. బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జెండా ఊపి పరుగును ప్రారంభించారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ 2కే రన్ నిర్వహించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులు 2కే రన్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను చేతపట్టుకొని రెండు కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో యువతీ, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బాన్సువాడలో స్పీకర్ పోచారం, కామారెడ్డిలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎల్లారెడ్డి, జుక్కల్లో ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, హన్మంత్షిండే, డిచ్పల్లిలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్మూర్లో ఎమ్మెల్యే జీవన్రెడ్డి, నిజామాబాద్లో జడ్పీ చైర్మన్ విఠల్రావు, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు తదితరులు పాల్గొన్నారు.