Nizamabad | కంటేశ్వర్ జనవరి 10 : ప్రజల మధ్యలో మత విధ్వేషాలు రెచ్చగొట్టే తీరును అరవింద్ మానుకోవాలని కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక పార్లమెంట్ సభ్యుడు అరవింద్ మాట్లాడుతూ నిజం సర్కార్ పేరు వల్లనే నిజామాబాద్ అభివృద్ధి చెందడం లేదని, నిజాం సాగర్లో నీళ్లు ఉండడం లేదని, నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడిందని చెప్పిన తీరును ఆయన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గత పాలకులపై విమర్శలు చేయడం కంటే ప్రస్తుతం నిజామాబాద్ ను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానిపై మాట్లాడితే ప్రజలు ఆదరిస్తారని సూచించారు.
పార్లమెంట్ సభ్యుడు అరవింద్ లెటర్ ప్యాడ్, విజిటింగ్ కార్డులలో నిజామాబాద్ అని ముద్రించుకుంటూనే ఇప్పుడు నిజామాబాద్ మున్సిపల్ ఎలక్షన్లో వస్తున్నాయని, ఈ నేపథ్యంలో నిజామాబాద్ పేరును ఇందూరు అని చెప్తూ ప్రజల మధ్య మత విధ్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అర్వింత్ తీరును ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారని, బీజేపీ నాయకులకు కేవలం ఎన్నికలు ఉన్నప్పుడే నిజామాబాద్ పైన ప్రేమ పుట్టుకువస్తుందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ సభ్యుడిగా ఏడు సంవత్సరాలుగా అరవింద్ జిల్లాను ఏ విధంగా గాలికి వదిలేశాడో, కేంద్ర ప్రభుత్వం దేశమంతటా అమలవుతున్న పథకాలు నిజామాబాద్ లో ఎంతవరకు అమలయ్యాయో అరవింద్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ ను స్మార్ట్ సిటీగా చేస్తానని చెప్పి ఇంతవరకు చేయకుండా అరవింద్ విఫలమయ్యారని, ఖేరో ఇండియా పథకం ద్వారా నిజామాబాద్ కు ఆట మైదానాలకు నిధులు తీసుకురావడంలో విఫలం అయ్యారని, మండిపడ్డారు.
ముద్ర లోన్స్ ద్వారా యువకులకు ఉపాధి కల్పించే విధంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీల ఏర్పాటు చేసుకోవడానికి యువకులకు కేంద్రం నుండి లోన్లు ఇప్పించకుండా కేవలం రాజకీయాల కోసం యువతను మతాల పేరుతో రేచ్చగొట్టి ఓట్లు దండుకునే దుర్మార్గపు ఆలోచనలో ఉన్నారని ఆరోపించారు. నిజామాబాద్ లో వర్షాలు పడితే మోకాళ్ల వరకు నీళ్లు వస్తాయని అరవింద్ మాట్లాడుతూనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కు మాత్రం కేంద్రం నుండి నిధులు తీసుకురావడం లేదని, సమస్యలు తెలిసినప్పటికీ వాటికి నిధులు తీసుకురాకుండా కేవలం మాటలు చెబుతూ గెలిచిన తర్వాత అధికారాన్ని ఉపయోగించుకుంటూ బాధ్యత రహితంగా అరవింద్ తిరుగుతున్నాడని విమర్శించారు.
నిజామాబాదులో రింగ్ రోడ్డు నిర్మించడానికి కేంద్రం నుండి అదనంగా ఏమైనా బడ్జెట్ తీసుకువచ్చారా అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైల్వే ప్రాజెక్టులలో బీదర్ వరకు డబ్బులు లైన్ కావాలని అంటూనే, ధర్మాబాద్ నుండి సికింద్రాబాద్ వరకు రైల్వే ప్రాజెక్టులలో కొంచెం కూడా మార్పు తీసుకురాలేదని, పులాంగ్ వాగు కబ్జాకు గురైతున్న సందర్భంలో పార్లమెంట్ సభ్యుడిగా దానిపై కూడా అరవిందుకు చిత్తశుద్ధి లేదని, పార్లమెంట్ సభ్యుడుగా ఉన్న అరవింద్ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత వాఖ్యలు చేస్తూ అహంకారపు మాటలు మాట్లాడడం సరైన పద్ధతి కాదని, పార్లమెంట్ సభ్యుడిగా కేంద్రం నుండి నిజామాబాద్ కు నిధులు తీసుకువచ్చి అభివృద్ధికి దోహదపడాలని సూచించారు.
ఇతర పార్టీ నాయకులు, సీఎంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం అరవింద్ స్థాయికి సరైంది కాదని, అరవింద్ మాట్లాడుతున్న అహంకారపు మాటలను జిల్లా ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీకి రాష్ట్రంలో మూడో స్థానం కల్పించిన విధంగానే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీజేపీకి గుణపాఠం చెబుతారని రాంభూపాల్ జ్యోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, ధర్మా గౌడ్, పత్తి శోభన్, రాజ్ గగన్, అసద్, దత్రిక భాస్కర్, మనోహర్, రాజ్, దిలీప్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.