కామారెడ్డి, జూలై 13 (నమస్తే తెలంగాణ) : జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతున్నది. మెడికల్ కళాశాల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కామారెడ్డి జిల్లాకు మెడికల్ కళాశాలను ఈ ఏడాది జనవరి నెలలో మంజూరు చేయగా, కళాశాలను ప్రారంభించడానికి వేగవంతంగా చర్యలు చేపట్టారు. ఈ మేరకు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) బృందం ఇప్పటి వరకు మూడు సార్లు పర్యటించి, ఇక్కడ కళాశాల ఏర్పాటుకు కావాల్సిన సౌకర్యాలు, వనరుల గురించి క్షుణ్ణంగా పరిశీలించారు. తరగతులను ప్రారంభించడానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కళాశాలలో 26 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేవునిపల్లిలో ఉన్న మాతా శిశు దవాఖాన భవనంలో ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే జిల్లాలోని బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కృషితో నర్సింగ్ కళాశాల ప్రారంభం కాగా, ఇక్కడ వంద మంది విద్యార్థినులు నర్సింగ్ విద్యను అభ్యసిస్తున్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ కృషితో మెడికల్ కళాశాల ఏర్పాటు కాగా, ఈ ఏడాది నుంచి మరో వంద మంది విద్యార్థులు ఎంబీబీఎస్ విద్యను అభ్యసించనున్నారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ఆరోగ్య తెలంగాణగా మార్చడమే ధ్యేయంగా వైద్య రంగంపై ప్రత్యేక శ్రద్ధను కనబర్చుతున్నారు. నగరాలు, పట్టణాల్లో దవాఖానల నిర్మాణం, ఉన్న దవాఖానల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించి, పడకల సంఖ్యను పెంచడంతోపాటు వైద్యుల నియామకాన్ని చేపడుతున్నారు. అయితే రాష్ట్రంలో వైద్య కళాశాలలు తక్కువగా ఉండడంతో వాటి సంఖ్యను పెంచాలనే ఉద్దేశంతో తెలంగాణలోని తొమ్మిది కొత్త జిల్లాల్లో మెడికల్ కళాశాలలను మంజూరు చేశారు. అందులో భాగంగానే కామారెడ్డి జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరైంది. ఈ కళాశాల నిర్మాణానికి రూ.230 కోట్లు మంజూరయ్యాయి. ఈ ఏడాది 2023-24 విద్యా సంవత్సరంలో సెప్టెంబర్లోనే కళాశాల తరగతులు ప్రారంభించాలనే ఉద్దేశంతో స్థానిక ఎంసీహెచ్ భవనంలో కళాశాలను ప్రారంభిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఇప్పటికే 180 పడకల దవాఖాన ఉండగా, మరో వంద పడకల స్థాయిని పెంచి నిర్మాణ పనులను కొనసాగిస్తున్నారు.
26 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం
మెడికల్ కళాశాలలో ఇప్పటికే ప్రిన్సిపాల్, నలుగురు రెగ్యులర్ ప్రొఫెసర్లు, ఇద్దరు కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు ఉండగా, తాజాగా మరో 26 అసిస్టెంట్ ప్రొఫెసర్లను ప్రభుత్వం నియమించింది. అనాటమికి ఒకటి, సైకాలజికి ఒకటి, బయోకెమిస్ట్రీకి ఒకటి, పాథాలజికి ఒకటి, మైక్రోబయాలజికి ఒకటి, ఫోరెన్సిక్ మెడిసిన్కి ఒకటి, జనరల్ మెడిసిన్కు మూడు, పిడియాట్రిక్స్కు రెండు, సైకియాట్రికి ఒకటి, రేడియోడయాగ్నసిస్కి ఒకటి, జనరల్ సర్జరికి నాలుగు, ఆర్థోపెడిక్స్కు రెండు, ఈఎన్టీకి ఒకటి, ఓబిజికి మూడు, అనిస్తీషియాకు మూడు పోస్టులను మంజూరు చేయగా, ఇప్పటి వరకు 14 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు విధుల్లో చేరారు. కళాశాలలో ఐదుగురు ఆఫీస్ సూపరింటెండెంట్లు పని చేస్తున్నారు. ఇంకా నాన్ టీచింగ్ సిబ్బందిని నియమించనున్నారు.
నీట్ ద్వారా అడ్మిషన్లు
2023-24 విద్యాసంవత్సరానికిగాను సెప్టెంబర్లో నిర్వహించే నీట్ కౌన్సిలింగ్ ద్వారా కామారెడ్డిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో అడ్మిషన్లు జరుగుతాయి. మొత్తం వంద సీట్లను భర్తీ చేయనున్నారు. కళాశాలలో సీట్లు పొందిన విద్యార్థులకు హాస్టల్ వసతి కోసం భవనాలను పరిశీలిస్తున్నారు. కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ ప్రత్యేక శ్రద్ధతో కళాశాలను ఈ ఏడాది ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా వీరు పర్యవేక్షిస్తున్నారు. కాగా కామారెడ్డికి మెడికల్ కళాశాల మంజూరవడంతో జిల్లా విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
త్వరలో సీట్ల భర్తీ ప్రక్రియ
కామారెడ్డిలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నాం. ఎంసీహెచ్ భవన పనులు జోరుగా సాగుతున్నాయి. సెప్టెంబర్లో నీట్లో సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. మొత్తం వంద సీట్లను భర్తీ చేస్తారు. ఇప్పటికే ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం పూర్తయింది. అక్టోబర్లో తరగతులు ప్రారంభమవుతాయి.
– డాక్టర్ పీ.వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్, మెడికల్ కళాశాల
ఏర్పాట్లు కొనసాగుతున్నాయి
ఈ ఏడాది సెప్టెంబర్లో తరగతులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. కళాశాల నిర్మాణపు పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 14 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు కాంట్రాక్టు ప్రొఫెసర్లు, నలుగురు రెగ్యులర్ ప్రొఫెసర్లు పని చేస్తున్నారు. ఐదురుగు అసిస్టెంట్ సూపరింటెండెంట్లు ఉన్నారు. నాన్టీచింగ్ సిబ్బంది నియామకం జరగనుంది.
– ఎం.సంతోష్, సూపరింటెండెంట్, మెడికల్ కళాశాల
పిల్లలకు అందుబాటులో వైద్య విద్య
పదేండ్ల క్రితం అతి తక్కువ కళాశాలలు ఉండడంతో వైద్య విద్యలో సీటు పొందాలంటే కలగానే మిగిలేది. కానీ నేడు సీఎం కేసీఆర్ 33 జిల్లాలకు మెడికల్ కళాశాలలను మంజూరు చేసి, వైద్య విద్యను పేదలకు అందుబాటులోకి తెచ్చారు. సీఎం కేసీఆర్కు, ఎమ్మెల్యే గంపగోవర్ధన్కు ధన్యవాదాలు.
– సులోచన, ప్రైవేటు లెక్చరర్, ఆర్యభట్ట కళాశాల