ఆర్మూర్, ఆగస్టు 18: సమైక్య రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆర్మూర్ పట్టణంలో ఏ కాలనీని చూసినా, ఏ వీధిలోకి వెళ్లినా సమస్యలే దర్శనమిచ్చేవి. రోడ్లపై అడుగడగునా గుంతలు.. చెత్తా చెదారంతో మురికి కూపాలుగా కనిపించేవి. వీధిలైట్లు వెలుగక.. పొద్దుగూకితే గల్లీలన్నీ అంధకారంలోకి వెళ్లేవి. స్వరాష్ట్రంలో పుష్కలంగా నిధులు మంజూరు కావడంతో నేడు ఆర్మూర్ పట్టణం అభివృద్ధికి కేరాఫ్గా మారింది. 2007కు ముందు మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న ఆర్మూర్.. 23 వార్డులతో 3వ గ్రేడ్ మున్సిపాలిటీగా ఏర్పాటయ్యింది. సరిపడా నిధులు ఇవ్వకపోవడంతో 2014 వరకు పట్టణంలో అభివృద్ధి ‘ఎక్కడవేసిన గొంగడి అక్కడే..’ అన్నట్లుగా ఉండేది.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అఖండ మెజారిటీతో విజయం సాధించింది. ఉద్యమ నాయకుడు కేసీఆర్.. ముఖ్యమంత్రిగా పాలనాపగ్గాలు చేపట్టాక తెలంగాణను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జీవన్రెడ్డి సారథ్యంలో ఆర్మూర్ నియోజకవర్గం సైతం అభివృద్ధిలో పరుగులు పెట్టింది. ప్రధానంగా ఆర్మూర్ పట్టణ స్వరూపమే పూర్తిగా మారిపోయింది. సీఎం కేసీఆర్ సహకారంతో ప్రధాన రహదారులన్ని బీటీ, సీసీతో నిర్మించారు. వీధి దీపాలు, ఎక్కడిక్కడ మురికి కాలువలను ఏర్పాటు చేశారు. 2018లో ఆర్మూర్ మండల పరిధిలోని మామిడిపల్లి, పెర్కిట్ గ్రామ పంచాయతీలను సైతం పట్టణంలో విలీనం చేసి మొత్తం 36వార్డులతో 2వ గ్రేడ్ మున్సిపాలిటీగా మార్చారు. అప్పటి నుంచి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో ఎమ్మెల్యే జీవన్రెడ్డి కోట్ల రూపాయల నిధులను తెచ్చి ఆర్మూర్ పట్టణాన్ని మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నవనథ సిద్ధులగుట్టకు రూ. 20కోట్ల 40లక్షల వ్యయంతో డబుల్ లేన్తో ఘాట్ రోడ్డును నిర్మించారు. సెంట్రల్ లైటింగ్ను ఏర్పాటు చేశారు. భక్తుల కోరిక మేరకు గుట్టపై మరో తొమ్మిది ఆలయాలతోపాటు ఎక్కడిక్కడ రోడ్లు, పార్కు, పచ్చదనంతో పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం గుట్టపై పిరమిడ్ ధ్యాన మందిరాన్ని సైతం నిర్మిస్తున్నారు. భక్తుల తాకిడి పెరగడంతో ప్రతి సోమవారం అన్నదానం చేస్తున్నారు.
ఆర్మూర్లో 30 పడకల దవాఖాన ఉండేది. కనీస వసతులు లేక రోగులు నానా ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం రూ. 16 కోట్ల వ్యయంతో వంద పడకల దవాఖానగా అప్గ్రేడ్ చేసి మెరుగైన సేవలు అందిస్తున్నారు. దవాఖానలో డయాలసిస్ సెంటర్ను సైతం ఏర్పాటు చేసి ఖరీదైన వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందిస్తున్నారు. స్థానికులతో మెట్పల్లి, నిర్మల్ ప్రాంతల నుంచి సైతం రోగులు ఇక్కడికి వచ్చి డియాలసిస్ చేయించుకుంటున్నారు. ప్రసూతి సేవల్లో ఆర్మూర్ దవాఖాన.. రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం గమనార్హం.
ఒకప్పుడు ఆర్మూర్ పట్టణంలోని ప్రధాన రోడ్లు సైతం అంధకారంలో ఉండేవి. ప్రస్తుతం ఆర్మూర్ రూపురేఖలు మారిపోయాయి. పాత బస్టాండ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా, కొత్త బస్టాండ్, మామిడిపల్లి చౌరస్తా వరకు రోడ్లను విస్తరించి డివైడర్లు నిర్మించారు. మధ్యలో అందమైన మొక్కలను నాటారు. మరోవైపు మామిడిపల్లి చౌరస్తా నుంచి అటు పెర్కిట్, ఇటు మామిడిపల్లి గ్రామం వరకు రోడ్డు మధ్యలో ఇనుప కంచెలను ఏర్పాటు చేసి మొక్కలను నాటారు. మొత్తం ప్రధాన రోడ్లపై సెంట్రల్ లైటింగ్, రంగు రంగుల అందమైన ఎల్ఈడీ విద్యుద్దీపాలతో అలంకరించండంతో ఆర్మూర్ పట్టణం జిగేల్ మంటున్నది. జర్నలిస్టు కాలనీ రోడ్డులో క్లాక్ టవర్ను నిర్మించి, దాని ఎదుట.. మన జాతి స్ఫూర్తిని చాటేలా వంద అడుగుల భారీ మువ్వన్నెల జెండాను ఏర్పాటు చేశారు.
ఆర్మూర్పట్టణ ప్రజల అహ్లాదం కోసం గూండ్ల చెరువు, మల్లారెడ్డి చెరువుల వద్ద ట్యాంక్ బండ్లు నిర్మిస్తున్నారు. హౌసింగ్బోర్డ్ కాలనీలో సుందరమైన పార్కు, ప్రధాన కాలనీల్లో ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేశారు. గూండ్ల చెరువును రూ. కోటీ 56లక్షల వ్యయంతో మిషన్ కాకతీయ కింద అధునీకరించి ప్రజలు సరదగా విహరించేందుకు బోటింగ్ను ఏర్పాటు చేశారు.
ఆర్మూర్ పట్టణంలోని ప్రధాన కూడలి అయిన అంబేద్కర్ చౌరస్తా ఒక్కప్పుడు చాలా ఇరుకుగా ఉండేది. నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్కు వెళ్లే ప్రయాణికులు ఈ చౌరస్తా మీదుగానే వెళ్లాలి. ఇరుకైన రోడ్డు కారణంగా చౌరస్తాలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకునేవి. ఈ ప్రధాన కూడలిని నేడు విస్తరించి సుందరంగా తీర్చిదిద్దారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి అంబేద్కర్ చౌరస్తాను ఆధునీకరించారు. అంబేద్కర్ విగ్రహం చుట్లూ గ్రానైట్తో ముస్తాబు చేశారు. పట్టణం గుండా వెళ్లేవారికి ఆర్మూర్ చరిత్ర తెలిసేలా చౌరస్తావద్దనే నవనథ సిద్ధుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆకట్టుకునేలా రంగురంగుల విద్యుద్దీపాలతో వాటర్ ఫౌంటేన్ను సైతం ఏర్పాటు చేశారు.