ఆర్మూర్, మే7; అడ్డంకులను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని జీవించిన అంబేద్కర్ ఆచరించిన విధానాలు అందరికీ మార్గదర్శకుమని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన 14 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దళిత సాధికరత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు ఇప్పుడు ఎన్నో కుటుంబాల్లో వెలుగు నింపుతోందన్నారు. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ వద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు. ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ.. ఒక వ్యక్తికి ఇన్ని విగ్రహాలు ఎందుకు ఉన్నాయని, విగ్రహం వెనుక ఉన్న చరిత్రను తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలని కోరారు. అంత చదువుకున్న అంబేద్కర్కు సైతం కులం పేరు చెబితే ముంబైలో ఇల్లు అద్దెకు దొరకలేదని, నాడు అంబేద్కర్ ఎదుర్కొన్న సమస్యలను ఇప్పటికీ దేశంలో చాలా మంది ఎదుర్కొంటున్నారని, అది పోవాలంటే సామాజిక మార్పు రావాలన్నారు. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చే బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఎంపీపీ పస్క నర్సయ్య, కౌన్సిలర్లు రవిగౌడ్, ఆకుల రాము, జడ్పీటీసీ మెట్టు సంతోష్, డాక్టర్ అశోక్, సరిత, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పూజనరేందర్, మండల అధ్యక్షుడు ఆలూర్ శ్రీనివాస్రెడ్డి, ఈ గంగాధర్, పండిత్ పవన్, దాసు, జీజీ రాం, సుంకరి రవి, దళిత నాయకులు పాల్గొన్నారు.
మండలంలోని రాంపూర్కు చెందిన దయానంద్ దళిత బందు పథకం ద్వారా వచ్చిన రూ.10లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఫౌల్ట్రీ ఫామ్ సముదాయాన్ని ఆదివారం ఎమ్మెల్యే జీవన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా దయానంద్, ఆయన కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే జీవన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆలూర్ శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
పట్టణంలోని జంబిహనుమాన్ ఆలయ ఆవరణలో ఆర్మూర్ శాఖ గ్రంథాలయ భవనంపై మొదటి అంతస్తు నిర్మాణ పనులకు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రంథాలయం లోపల పుస్తకాలు, సౌకర్యాలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ ఎల్ఎంబీ రాజేశ్వర్, మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినితా పవన్, ఎంపీపీ పస్క నర్సయ్య, వైస్ చైర్మన్ మున్నుబాయ్, కౌన్సిలర్ రవిగౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పూజనరేందర్, నాయకులు పండిత్ పవన్, సిబ్బంది పాల్గొన్నారు.
మాక్లూర్, మే7: నియోజకవర్గంలోని గొల్ల, కురుమల అభివృద్ధికి అండగా ఉంటానని ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డిని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని గొల్ల, కురుమలు ఆదివారం అంకాపూర్లో ఎమ్మెల్యేను ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కురుమలకు నందిపేట్ మండలంలోని సీహెచ్.కొండూర్ శివారులో కోటి రూపాయలతో కల్యాణ మండపం నిర్మించామని, త్వరలో దానిని ప్రారంభిస్తానని అన్నారు. గొల్లలకు ఆర్మూర్ పట్టణంలో రూ.కోటీ నిధులతో మండపాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో గొల్ల, కురుమల కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. రాబోయే ఎన్నికల్లో జీవన్రెడ్డికి అండగా ఉండి ఎమ్మెల్యేగా గెలిపిస్తామని గొల్ల, కురుమలు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో గొల్ల, కురుమ నాయకులు ఆశన్న, దేవన్న, అశోక్, సురేశ్, భోజన్న, ఒడ్డెన్న, గంగాధర్, పోతన్న, ప్రభాకర్, జనార్దన్, భోజన్న, లింగం, లక్ష్మణ్, ధర్మపతి, గంగాధర్, సతీశ్, రాజశేఖర్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.