మాక్లూర్, ఆక్టోబర్ 28: నియోజకవర్గ జనమే తన బలమని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. ఎన్నికల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలే తన ప్రచార అస్ర్తాలని పేర్కొన్నారు. తనను మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. మండలంలోని వేణుకిసాన్నగర్ తండా, గంగరమంద, రాంపూర్, వెంకటాపూర్, మెట్పల్లి, ధర్మోరా, మాందాపూర్, వల్లభాపూర్ గ్రామాల్లో శనివారం ప్రజాఆశీర్వాద యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు జీవన్రెడ్డికి ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్ యూత్ విభాగం నాయకుడు అనుగు నీరజ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాల్లో తొమ్మిదేండ్లలో పూర్తిచేసిన అభివృద్ధి పనులను జీవన్రెడ్డి వివరించారు. ఆర్మూర్ నియోజకవర్గం అంటేనే అభివృద్ధికి చిరునామా అని అన్నారు. ప్రతి గ్రామంలో కుల సంఘ భవనాలకు నిధులు మంజూరు చేశానని తెలిపారు. తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. మాక్లూర్ మండలానికి రూ. కోట్లాది నిధులు కేటాయించినట్లు తెలిపారు. మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కొత్త సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ తీసుకురానున్నారని చెప్పారు. దసరా వేషగాళ్లు, సంక్రాంత్రి గంగిరెద్దులోళ్లు తనతో పోటీకి వస్తారనుకుంటే.. ప్రజల మధ్య చిచ్చుపెట్టే నేరగాళ్లు వచ్చారని మండిపడ్డారు. వారి మాయలో పడొద్దని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్, బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదని ఎద్దేవా చేశారు. ప్రచారంలో ఆయా గ్రామాల సర్పంచులు రమేశ్ నాయక్, గంగాధర్, సాయిలు, భవానీరఘు, సులోచన, శైలజ, మంజులాసుధాకర్, ఎంపీపీ ప్రభాకర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్యం, విండో చైర్మన్ శ్రీనివాస్గౌడ్, నాయకులు పాల్గొన్నారు.