శక్కర్నగర్, డిసెంబర్ 23: తన సోదరి అంత్యక్రియలు సరిగా జరిపించలేదని మనస్తాపం చెందిన ఓ వృద్ధురాలు.. తన పరిస్థితి ఏమిటో అని ఆందోళనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతున్నది. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని తట్టికోట్ ప్రాంతానికి చెందిన రుద్ర అబ్బవ్వ (73) నివాసముంటున్నారు. ఆ పక్కనే ఆమె కుటుంబం కూడా నివాసముంటున్నది. ముగ్గురు కుమారులు ఉన్న అక్క ఇటీవలే చనిపోగా, అంత్యక్రియల విషయంలో కొడుకులు గొడవ పడ్డారు. ఇది చూసి చెల్లెలు అబ్బవ్వ మనస్తాపానికి గురయ్యింది. ముగ్గురు కుమారులు ఉన్న సోదరి విషయంలో ఇలా జరిగిందని, ఏకైక కుమారుడు ఉన్న తన పరిస్థితి ఏమిటో అని ఆవేదన చెందింది.
దీంతో ఈ నెల 20న బుధవారం ఇంట్లో ఉరేసుకునేందుకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమె మెడకు ఉన్న తాడును తొలగించడంతో బతికి బయటపడింది. కానీ, అదేరోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత అబ్బవ్వ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన నిజామాబాద్లోని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై బోధన్ పట్టణ సీఐ వీరయ్య వివరణ కోరగా, వృద్ధురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం వాస్తవమేనన్నారు. అయితే, ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.