నిజామాబాద్ క్రైం, మార్చి 12: తాళం వేసిన రెండిండ్లలో పట్టపగలే చోరీ జరిగిన ఘటన నగరంలోని ఐదో టౌన్ పరిధిలో శనివారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కార్పొరేషన్ పరిధిలోని నాగారం బ్రాహ్మణకాలనీలో ఉండే విజయ్కుమార్ జోషి బ్రహ్మపురిలోని రాంమందిరం మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్గా విధులు నిర్వహిస్తున్నది. ఇద్దరూ శనివారం ఇంటికి తాళం వేసి విధులకు వెళ్లారు. సాయంత్రం వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉన్నది. బీరువా ధ్వంసం చేసి, వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించి ఐదో ఠాణా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బీరువాలోని ఏడు తులాల బంగారం నగలు, రూ.పది వేల నగదు చోరీ జరిగినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై సాయినాథ్ తెలిపారు. క్లూస్ టీమ్తో ఆధారాలు సేకరించి, దర్యాప్తు చేస్తున్నామన్నారు.
మరో ఘటనలో.. నగరంలోని డ్రైవర్స్ కాలనీకి చెందిన యుగంధర్ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి వెళ్లాడు. శనివారం ఇంటి తాళం పగులగొట్టి ఉండడంతో పక్కింటి వారు ఫోన్ ద్వారా యజమానికి సమాచారం అందించారు. వారు ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో నుంచి ఎంత సొత్తు చోరీకి గురైందనే విషయం తెలుస్తుందని స్థానికులు తెలిపారు. పోలీసులు పెట్రోలింగ్ ముమ్మ రం చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.