–మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
వేల్పూర్, ఏప్రిల్ 14 : అంబేద్కర్ కొందరువాడు కాదని, అందరివాడని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని సమాజంలోని పీడీత, బడుగు బలహీన వర్గాలు ప్రజల అభ్యున్నతి కోసం రచించారని పేర్కొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు. రాజ్యాంగం పీడిత, బడుగు, బలహీన వర్గాలు ప్రజలకు ఒక శ్వాస, ఊపిరిలాంటిదని అన్నారు. ఆయన చూపు ఎప్పుడు వీరివైపే ఉండేదన్నారు.
రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను కాపాడుకోవాలంటే చదువే బలహీనుల ఆయుధం కావాలని అంబేద్కర్ అన్నారని తెలిపారు. ఆస్తులు, కష్టాలు, సంతోషాలు వస్తాయి పోతాయని కానీ సంపాదించిన జ్ఞానం ఎన్నటికీ పోదన్నారు. పిల్లలు చదివేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో వెయ్యికి పైగా గురుకులాలను ఏర్పాటు చేశారని తెలిపారు. అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకుని ప్రతిఒక్కరూ చదువుకోవాలన్నారు. రాజ్యాంగంలో పొందుపర్చబడిన ఆర్టికల్ 3 ద్వారానే రాష్ట్రం ఏర్పడిందని కేసీఆర్ ఎప్పుడూ అంటారని, అందుకే హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించిన సెక్రటేరియట్కు డాక్టర్ బీఆర్.అంబేద్కర్ పేరు పెట్టారని వివరించారు. 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని కూడా సాగరతీరాన ఏర్పాటు చేశారని తెలిపారు.