సిరికొండ, జనవరి 5: ప్రజలు తనపై నమ్మకంతో గెలిపించారని, నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. మండలకేంద్రంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని శుక్రవారం పరిశీలించారు. అంతకుముందు తాటిపల్లిలో గ్రామంలో హనుమాన్ ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం చీమన్పల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించి ప్రజాసేవ చేసే బాధ్యతను అప్పగించారని, మీవాడిగా ప్రజల్లోనే ఉంటానని అన్నారు.
ఇది ప్రజాపాలన అని, ప్రజలు స్వేచ్ఛగా పనులను చేసుకోవాలని సూచించారు. పోడు రైతుల సమస్యలను ప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందని భరోసా కల్పించారు. కాంగ్రెస్ పాలనలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని, హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండు ఇప్పటికే అమలు చేశామన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవి, డీసీసీబీ మాజీ చైర్మన్ సాయిరెడ్డి, శేఖర్గౌడ్, డీసీసీ జిల్లా కార్యదర్శి భాస్కర్రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఎర్రన్న, నాయకులు ఉన్నారు.